ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. టీమిండియా వరుస విజయాల జోరుకు సౌతాఫ్రికా కళ్లెం వేసింది. సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ ఘోర పరాజయం ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
ఈ భారీ ఓటమి.. టీమిండియా నెట్రన్రేట్ను దారుణంగా దెబ్బతీసింది. దాంతో సూర్యసేన సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తదుపరి రెండు మ్యాచ్లకు రెండు గెలిచినా ఇతర జట్ల నెట్రన్రేట్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్ల ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తిగా కనిపించాడు. ప్రణాళికలకు తగ్గట్లు భారత ఆటగాళ్లు ఆడటం లేదని అసహనం వ్యక్తం చేశాడు. డగౌట్లో గంభీర్ కోపంగా ఉండటం టీవీ కెమెరాల్లో పదే పదే కనిపించింది. ఓ దశలో సహనం కోల్పోయిన గంభీర్.. భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు.

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యాను గట్టిగా మందలించాడు. మన ప్రణాళికలు ఏంటి? మీరు చేస్తున్న బౌలింగ్ ఏంటని మండిపడ్డాడు. హార్దిక్ పాండ్యా కూడా గట్టిగా బదులివ్వడంతో అక్కడ చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హార్దిక్ చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని గంభీర్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. వరుణ్ చక్రవర్తీ వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హార్దిక్ పాండ్యా వేసిన 10 ఓవర్లో ఆఖరి బంతిని నోబాల్గా వేసాడు. ఈ బంతిని కాస్త మిల్లర్ సిక్సర్గా మలిచాడు. దాంతో అప్పటి వరకు నెమ్మదిగా సాగిన సౌతాఫ్రికా జట్టుకు మూమెంటమ్ లభించింది. ఈ బంతిపైనే గంభీర్.. హార్దిక్తో వాగ్వాదం దిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై గంభీర్ తీవ్ర అసంతృప్తితో కనిపించాడు. ప్రస్తుతం గంభీర్ ఎక్స్ప్రెషన్స్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.