నాలుగు టీ20ల సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. శుక్రవారం డర్బన్ వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరీస్కు తెరలేవనుంది. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్పైనే ఉన్నాయని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. సంజూ శాంసన్ నిలకడగా రాణించకపోవడే ఇందుకు కారణమని చెప్పాడు.
దాదాపు దశాబ్దం క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సంజూ శాంసన్.. ఇప్పటికీ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. నిలకడలేమి ఆటతో పాటు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజూ విఫలమయ్యాడు. అంతేకాకుండా టీమిండియా మేనేజ్మెంట్ నుంచి కూడా అతనికి సరైన మద్దతు లభించలేదు.

అయితే సీనియర్ ఆటగాళ్లంతా టీ20లకు దూరమైన నేపథ్యంలో సంజూ శాంసన్కు పొట్టి ఫార్మాట్లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. బంగ్లాదేశ్తో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్లో సంజూ శాంసన్ సెంచరీతో రాణించాడు. దాంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ గురించి అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'సంజూ శాంసన్ను జట్టులో కొనసాగించడం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్పై చేసిన సెంచరీ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. శాంసన్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఓ క్లాస్ ప్లేయర్. కాకపోతే ఆటలో కాస్త నిలకడ ఉండదు. భారత సెలెక్టర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని అనుకుంటున్నాను.
సంజూ శాంసన్ను ఓపెనర్గా లేక తర్వాతి మూడు స్థానాల్లో ఎక్కడ ఆడించినా రాణిస్తాడు. క్రీజులో లోపలికి జరిగి బ్యాక్ఫుట్పై బలంగా నిలబడి షాట్లు కొట్టగలడు. పేస్ బౌలింగ్లో కాస్త సమయం తీసుకునే ఆడుతాడు. స్పిన్నర్లపై మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడుతాడు. సౌతాఫ్రికాలో ఎలా ఆడుతాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.'అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.
తొలి టీ20 శుక్రవారం జరగనుండగా.. రెండో టీ20 ఆదివారం(నవంబర్ 10), మూడో టీ20 బుధవారం(నవంబర్ 13), నాలుగో టీ20 శుక్రవారం( నవంబర్ 15) జరగనున్నాయి.