
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా బంతి మెరుపును మరింత పెంచేందుకు... రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు ఉమ్మి (సెలైవా)ని ఉపయోగిస్తుంటారు. అయితే ఉమ్మి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ఇక మీదట మ్యాచ్ల సందర్భంగా బౌలర్లు ఉమ్మిని బంతిపై రుద్దకుండా నిషేధం విధిస్తూ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఐసీసీకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బౌలర్లు ఈ నిర్ణయంతో బ్యాట్స్మెన్కు లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత తిరిగి ఉమ్మిని వాడవచ్చని అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తాత్కాలిక చర్యల్లో భాగంగానే ఆ ప్రతిపాదన చేశామని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో చెప్పుకొచ్చాడు.
'ఉమ్మిపై నిషేధం తాత్కాలిక చర్యల్లో భాగంగా చేసిన ప్రదిపాదనే. కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకే ఇది అమలులో ఉంటుంది. ఒక్కసారి వైరస్ ప్రభావం ముగిశాక ఇంతకు ముందులా ఉమ్మిని వాడవచ్చు.'అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అలాగే బంతిని స్వింగ్కు అనుకూలంగా మార్చేందుకు ఉమ్మికి బదులుగా కృత్తిమ పదార్థాన్ని వినియోగించాలా? వద్దా అన్న విషయంపై చర్చలు సాగుతున్నాయని తెలిపాడు.
ఇతర వస్తువులను అనుమతించాలంటే.. గతంలో జరిగిన ఘటనలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు బెన్ క్రాప్ట్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లు వ్యవహారాన్ని ప్రస్తావించిన కుంబ్లే... వారు ట్యాంపరింగ్ చేశారని ఐసీసీ చర్యలు తీసుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా మరింత కఠినంగా వ్యవహరించిందని గుర్తు చేశాడు. అలాంటిది ఇప్పుడు ఇతర వస్తువులను చట్టపరంగా అనుమతిస్తే వారి శిక్షలకు అర్థం లేకుండా పోతుందన్నాడు.