టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. న్యూజిలాండ్తో మూడో టెస్ట్లోనూ రోహిత్ శర్మ(18) దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత రోహిత్ శర్మ ఒక్క హాఫ్ సెంచరీ మినహా మరో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. తాజాగా ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లోనూ నిరాశపరిచాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు.
అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్లో సాంకేతిక లోపం ఉందని మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, సైమన్ డౌల్ అన్నారు. ఈ మ్యాచ్కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరూ.. ఈ సమస్య రోహిత్ శర్మకు బలహీనతగా మారిందని అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ ఔటైన విధానంపై ముందుగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ పేస్ బౌలర్లకు ఒకే రీతిలో ఔటవుతున్నాడని చెప్పాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మను పేసర్లు ఇబ్బంది పెడుతున్నారని, ఇది ఆందోళన పరిచే విషయమన్నాడు. 'బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో కూడా రోహిత్ శర్మ ఇలానే ఔటయ్యాడు. టీమ్ సౌథీ ఈ విషయాన్ని పసిగట్టి అదే బంతితో ఔట్ చేశాడు. తాజాగా మ్యాట్ హెన్రీ అదే ఫార్మూలాతో బౌలింగ్ చేసి రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చాడు.
ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో షార్ట్ పిచ్ బాల్ వేసి రోహిత్ శర్మను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ బంతి ఆడే విషయంలో రోహిత్ స్క్వేర్ అప్ అవుతూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ బంతి ఏ మాత్రం స్వింగ్ అవ్వడం లేదు. బౌలర్లు డెక్తో హిట్ చేసి రోహిత్ శర్మను ట్రాప్ చేస్తున్నారు. బంతి స్వింగ్ అవుతుందేమోనని పొరబడి రోహిత్ మూల్యం చెల్లించుకుంటున్నాడు. వీలైనంత త్వరగా రోహిత్ ఈ సమస్యను అధిగమించాలి. లేకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ బౌలర్లు కూడా ఇదే అస్త్రాన్ని ఉపయోగిస్తారు.'అని అనిల్ కుంబ్లే హెచ్చరించాడు.
అనిల్ కుంబ్లే వ్యాఖ్యలతో ఏకీభవించిన సైమన్ డౌల్.. రోహిత్ స్క్వేర్ అప్ అవుతూ మూల్యం చెల్లించుకుంటున్నాడని తెలిపాడు. అతని బ్యాట్ ఫేస్ చూస్తే మిడ్ వికెట్ వైపు ఆడాలనుకున్నట్లు తెలుస్తోందన్నాడు. ఈ సమస్యపై రోహిత్ కచ్చితంగా ఫోకస్ పెడుతాడని భావిస్తున్నానని సైమన్ డౌల్ తెలిపాడు.
అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో కూడా రోహిత్.. భుజాలు పైకి లేపి ఆడే ప్రయత్నం చేశాడని చెప్పాడు. టెస్ట్ ఫార్మాట్లో కుడి చేతి పేసర్లపై రోహిత్ శర్మకు మెరుగైన రికార్డ్ లేదని గుర్తు చేశాడు. అతని గణంకాలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని చెప్పాడు.