న్యూజిలాండ్తో తొలి టెస్ట్లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యానికి దూకుడే ప్రధాన కారణమని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. భారత బ్యాటర్లలో ఓపిక లోపించిందని అభిప్రాయపడ్డాడు. అసలు సిసలు టెస్ట్ ఫార్మాట్ బ్యాటింగ్ ఆడటం లేదన్నాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై భారత్కు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. టీమిండియా ఆటతీరుపై అనిల్ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ అనాలోచిత నిర్ణయాలే రోహిత్ సేన కొంపముంచాయని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో ఆడించడం ఘోర తప్పిదమన్నాడు.

అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన అనిల్ కుంబ్లే.. పిచ్ మరీ బ్యాటింగ్కు ప్రతికూలంగా లేదని చెప్పాడు. 'విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడాలి. ఆ స్థానంలో అతనే టాప్ బ్యాటర్. మూడో స్థానంలో చతేశ్వర్ పుజారా వంటి క్లాస్ బ్యాటర్ బ్యాటింగ్ చేయాలి. సుదీర్ఘ కాలం పాటు అతను నెంబర్ 3 బ్యాటర్గా సేవలు అందించాడు.
పుజారా జట్టులో ఉండి ఉంటే.. ఇన్నింగ్స్కు అడ్డుగోడలా నిలబడేవాడు. బంతి మీదకు వచ్చే వరకు ఆగి ఓపిగ్గా ఆడేవాడు. జట్టులో అలాంటి క్లాస్ ప్లేయర్ లోపించాడు. ఆ తరహా క్లాస్ బ్యాటింగ్ కూడా లోపించింది. ఈ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ పునారాలోచన చేయాలి. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది.'అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.
సుమారు పదేళ్ల పాటు పుజారా.. టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. తనదైన జిడ్డు బ్యాటింగ్తో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత అతన్ని టీమిండియా మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. శుభ్మన్ గిల్ అతని స్థానంలో ఆడుతున్నాడు.
అయితే తాజా మ్యాచ్కు గిల్ దూరం కావడంతో కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. రోహిత్ శర్మ ఔటవ్వగానే.. క్రీజులోకి వచ్చిన కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. వెనువెంటనే వికెట్లు పడటంతో తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది. దాంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.