హైదరాబాద్: టీమిండియా వెటరన్ ప్లేయర్, హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీరని అన్యాయం చేసిందని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఎంతో ప్రతిభ కలిగిన రాయుడికి అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ అవకాశాలు రాలేదన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్లో అంబటి రాయుడిని ఆడించకపోవడం సెలెక్టర్లు, టీమ్మేనేజ్మెంట్ చేసిన ఘోర తప్పిదమని తెలిపాడు.
పరోక్షంగా అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్తో పాటు టీమ్మేనేజ్మెంట్లో కీలకమైన విరాట్ కోహ్లీ, రవి శాస్త్రిలను కుంబ్లే తప్పుబట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ విజయంతో రాయుడి తన కెరీర్కు ఘనమైన వీడ్కోలు పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2018 నుంచి ఆడుతున్న రాయుడు.. ఫైనల్ మ్యాచ్కు ఒక్క రోజు ముందే ఐపీఎల్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

కెరీర్లో ఆరో ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన రాయుడు తనకు అండగా నిలిచి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఆనందలోనే అన్ని రకాల భారత క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు హింట్ ఇచ్చాడు.
అంబటి రాయుడి రిటైర్మెంట్ నేపథ్యంలో జియో సినిమా ఎక్స్పర్ట్గా ఉన్న అనిల్ కుంబ్లే అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. రాయుడు 2019 వన్డే ప్రపంచకప్ ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'అంబటి రాయుడు 2019 వన్డే ప్రపంచకప్ ఆడాల్సింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అతన్ని ఆడించకపోవడం టీమిండియా చేసిన ఘోర తప్పిదం. జట్టులో నాలుగో స్థానం కోసం చాలా రోజులు ఆడించి చివరి నిమిషంలో అతన్ని జట్టులో నుంచే తీసేసారు. ఇది ఆశ్చర్యం కలిగించింది.'అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.
2018 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన రాయుడు అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా నాలుగో స్థానంలో దుమ్మురేపాడు. అయితే 2019 ఐపీఎల్లో అతను విఫలమవ్వడంతో సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టేసి త్రీడీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్కు అవకాశం కల్పించారు.
ఈ నిర్ణయం అప్పట్లో దుమారం రేపింది. సెలెక్టర్ల నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా రాయుడు విమర్శించాడు. దాంతో స్టాండ్ బైగా ఉన్న రాయుడికి బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో జట్టుకు దూరమైనా రాయుడికి చోటు కల్పించలేదు. ఆ టోర్నీలో టీమిండియా సెమీఫైనల్లోనే నిష్క్రమించింది.