
బెంగళూరు: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్వార్న్ హఠాన్మరణం తనను షాక్కు గురిచేసిందని టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నాడు. స్పిన్ దిగ్గజం ఇకలేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు వెల్లడించాడు. ఇక థాయ్లాండ్కు వెకేషన్కు వెళ్లిన షేన్ వార్న్ గుండెపోటుతో శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై స్పందించిన అనిల్ కుంబ్లే అతనితో ఉన్న జ్ఞపకాలను నెమరువేసుకున్నాడు.
ఆటపరంగా తమ మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, అయితే మైదానం బయట మాత్రం స్నేహభావంతో ఉండేవాళ్లమని కుంబ్లే చెప్పుకొచ్చాడు. ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన కుంబ్లే షేన్ వార్న్కు సంబంధించిన ఓ రహాస్యాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
'టీమిండియాతో షేన్ వార్న్ చాలా బాగా ఆడాడు. భారత ఆటగాళ్లు స్పిన్ను ఎదుర్కోవడంలో దిట్ట. అలాంటిది మనపై రాణించేందుకు చాలా కష్టపడ్డాడు. 1998లో జరిగిన సిరీస్ సందర్భంగా 'సచిన్ vs వార్న్' పోరాటంగా మారింది. తొలి ఇన్నింగ్స్ల్లో వార్న్ పైచేయి సాధిస్తే.. రెండో ఇన్నింగ్స్లో సచిన్ ఆధిక్యత ప్రదర్శించేవాడు. మరోక రహస్యం ఏమిటంటే.. షేన్ వార్న్ స్నేహితుడైతే ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసేవారు కాదు. అతను మన వార్న్ ఫ్రెండ్ అంటూ సైలెంట్గా ఉండేవారు. నేను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు ఇలానే జరిగేదే'అంటూ తన స్నేహితుడి మృతికి కుంబ్లే ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.
షేన్ వార్న్ మృతి చెందడంపట్ల మాజీ క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆసీస్ మాజీ సారథులు ఇయాన్ ఛాపెల్, రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, బ్రెట్లీ, మార్క్వా, మాథ్యూ హెడెన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్, కెవిన్ పీటర్సెన్ సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వెల్లడించారు.
దిగ్గజ బౌలర్గా ఎదిగిన షేన్ వార్న్.. వ్యక్తిత్వపరంగానూ నిజాయితీగా వ్యవహరించాడని గుర్తుచేసుకున్నారు. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఆటగాళ్లు కూడా మ్యాచ్కు ముందు రెండు నిమిషాల మౌనం పాటించడంతో పాటు బ్లాక్ రిబ్బన్స్తో బరిలోకి దిగారు.