
ఆ సెంచరీ నాకెంతో ప్రత్యేకం:
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛాట్షో 'డీఆర్ఎస్ విత్ యాష్'లో అనిల్ కుంబ్లే తాను 2007లో చేసిన సెంచరీ గురించి మాట్లాడారు. 'సెంచరీ చేయాలని నేను నా తొలి మ్యాచ్లోనే ఎంతో ప్రయత్నించాను. ప్రయత్నిస్తూనే ఉన్నాను. చివరికి 117వ మ్యాచులో ఆ కల నెరవేరింది. అందుకే ఆ సెంచరీ నాకెంతో ప్రత్యేకం. ఆ సమయంలో ఆనందంగా ఫీలయ్యాను' అని కుంబ్లే చెప్పారు. ఓవల్ వేదికగా ఇంగ్లడ్తో జరిగిన మ్యాచ్లో జంబో ఈ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

లక్ష్మణ్ కిందపడి సంబరాలు చేసుకున్నాడు:
'ఓవల్లో నేను సెంచరీ చేసాక నా కన్నా ఎక్కువగా బాల్కనీలోని నా సహచరులే సంతోషించారు. లేచి చప్పట్లతో నన్ను ప్రోత్సహించారు. ఆ సమయంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక వీవీఎస్ లక్ష్మణ్ అయితే కిందపడి మరీ సంబరాలు చేసుకున్నాడు. నేను డ్రెస్సింగ్ రూమ్ వెళ్లాక సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించారు' అని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు. భారత్ తరఫున 132 టెస్ట్లు, 272 వన్డేలు ఆడిన కుంబ్లే.. రెండు ఫార్మాట్లలో కలిపి 956 వికెట్లు తీసారు. ఇక 2007-2008 వరకు భారత జట్టుకు సారథ్యం కూడా వహించారు.

శ్రీశాంత్కి స్ట్రైక్ ఇవ్వొద్దని భావించా:
'నిలదొక్కుకున్న చివరి బ్యాట్స్మన్ నేనేనని తెలుసు. మరోవైపు శ్రీశాంత్ ఉన్నాడు. అప్పటికే అతడితో కలిసి 30 పరుగులు చేశా. ఆ సమయంలో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. నేనే పరుగులు చేయాలని, శ్రీశాంత్కి స్ట్రైక్ ఇవ్వొద్దని భావించా. కెవిన్ పీటర్సన్ బౌలింగ్లోనే సెంచరీ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నా. ముందుగానే క్రీజు బయటకు వచ్చా. అయితే పీటర్సన్ బంతి దూరంగా వేశాడు. బ్యాటు అంచుకు బంతి తాకిందని అర్థమైంది. వెంటనే పరుగు తీశా. అంపైర్ స్టీవ్ బక్నర్ దానికి బైస్ అని ఆలోచించేలోపే బ్యాటు పైకెత్తి గట్టిగా అరిచా' అని కుంబ్లే గుర్తుచేసుకున్నారు.

కోహ్లీతో విబేధాలు:
అనిల్ కుంబ్లే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కోచ్ పదవి నుండి తప్పుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మొదట్లో బాగానే ఉన్నా.. జంబో తరహా క్రమశిక్షణ విరాట్కు నచ్చలేదు. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావడంతో.. కుంబ్లేనే హుందాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.


Click it and Unblock the Notifications

ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులకు 5 సార్లు కరోనా పరీక్షలు!!










