
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా బంతి మెరుపును మరింత పెంచేందుకు... రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు ఉమ్మి (సెలైవా)ని ఉపయోగిస్తుంటారు. అయితే ఉమ్మి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ఇక మీదట మ్యాచ్ల సందర్భంగా బౌలర్లు ఉమ్మిని బంతిపై రుద్దకుండా అనిల్ కుంబ్లే నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఐసీసీకి సిఫారసు చేసింది. చెమటను మాత్రం ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
కరనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉండటంతో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోని ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన కమిటీ.. ఇంటర్నేషనల్ మ్యాచ్లకు తటస్థ అంపైర్లను కాకుండా ఆతిథ్య దేశ అంపైర్లను తీసుకురావాలని ప్రతిపాదించింది.
'మనం అసాధారణ పరిస్థితుల్లో జీవిస్తున్నాం. క్రికెట్ను రక్షించేందుకు సేఫ్గా మొదలుపెట్టేందుకు మా కమిటీ కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేసింది. మా సిఫారసులను ఐసీసీ బోర్డు ముందు ఉంచుతాం'అని కుంబ్లే పేర్కొన్నాడు.
రెడ్ బాల్ ఫార్మాట్లో బాల్ను స్వింగ్ చేయాలంటే కచ్చితంగా షైన్ చేయాలి. గతంలో క్రికెటర్లు ఉమ్మి లేదా చెమటతో దీనిని షైన్ చేసేవారు. కానీ ఇప్పుడు కరోనా కాలం కావడంతో సెలైవాను బ్యాన్ చేసింది. అంపైర్ల విషయంలోను కొత్త పద్దతిని పాటించబోతున్నారు. టెస్ట్ల్లో ముగ్గురు ఐసీసీ అంపైర్లు, ఒక్క హోస్ట్ అంపైర్ ఉండనున్నాడు. వన్డేలకు ఇద్దరు ఐసీసీ, ఇద్దరు హోస్ట్ కంట్రీ అంపైర్లు, టీ20ల్లో నలుగురు హోస్ట్ కంట్రీ అంపైర్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు.
కరోనా నేపథ్యంలో కొన్నాళ్లపాటు తటస్థ అంపైర్లను కాకుండా... అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆతిథ్య దేశ అంపైర్లను అంపైరింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫారసు చేసింది. క్రికెట్ కమిటీ ప్రతిపాదనలను పరిశీలించాకే వీటిని అమలు చేయాలా వద్దా అనే విషయాన్ని ఐసీసీ బోర్డు నిర్ణయిస్తుంది.