ప్రతి దాంట్లోనూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు
ప్రతి దాంట్లోనూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉంటాయని కుంబ్లే అన్నాడు. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాల పేరుతో మాజీ ఆటగాళ్లకు నోటిసులిస్తుంటే, ఆటలో వారి భాగస్వామ్యమే లేకుండా పోయే ప్రమాదం ఉందని కుంబ్లే ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎలా స్వీకరించారన్నది కూడా ముఖ్యమేనని కుంబ్లే అన్నాడు.
ఏ కోణంలో స్వీకరించారో
"క్రికెట్లోనే కాదు.. ప్రతి ప్రొఫెషనల్కు జీవితంలో పరస్పర విరుద్ధ ప్రయోజనం అనేది ఉంటుంది. అయితే దానిని మీరు ఏ కోణంలో స్వీకరించారో, అందులో మీ పాత్ర ఏమిటో ముందుగానే వెల్లడించడం కీలకం. ఇలా చేయడం ద్వారా ప్రజలు మనకు ఎలాంటి విరుద్ధ ప్రయోజనం లేదని విశ్వసిస్తారు. ప్రజలు దానిని నమ్మితే విరుద్ధ ప్రయోజనాలనే అంశమే లెక్కలోకి రాదు" అని కుంబ్లే తెలిపాడు.
జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్గా
జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్గా ఉంటూ.. చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఉన్న ఇండియా సిమెంట్స్లో రాహుల్ ద్రవిడ్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని ఎథిక్స్ ఆఫీసర్కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఇలాంటి కారణాలతో సీనియర్ క్రికెటర్లను క్రికెట్కు దూరం చేయడం సరికాదని కుంబ్లే అన్నాడు.
వాళ్లనూ వద్దంటే ఎలా?
"ఇప్పటివరకు భారత టెస్టు జట్టుకు దాదాపు 300 మంది ఆడారు. అందులో 50 శాతమే జీవించి ఉన్నారు. వాళ్లే ఆటకు ఎంతో కొంత చేయగలరు. వాళ్లనూ వద్దంటే ఎలా?" అని అనిల్ కుంబ్లే ప్రశ్నించాడు.