టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను తాను విమర్శించినట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. తాను ఎవరినీ విమర్శించలేదని స్పష్టం చేశాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా తడబడుతోంది.
దాంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై అనిల్ కుంబ్లే ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ తనకు అర్థం కావడం లేదని, ట్రావిస్ హెడ్ను ఔట్ చేసే ప్రణాళికలు లేకపోవడం ఏంటని కుంబ్లే అన్నట్లు కొందరు ఆకతాయిలు ఫేక్ పోస్ట్లు సృష్టించారు.

అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ విఫలమైన అనంతరం.. కుంబ్లే ఘాటు వ్యాఖ్యలు చేశారని అసత్య ప్రచారం చేశారు. గత ఐదేళ్లుగా కోహ్లీ సరిగ్గా ఆడటం లేదని, అతన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని కుంబ్లే మండిపడినట్లు పోస్ట్లు క్రియేట్ చేశారు. కోహ్లీ లగేజీ సర్దుకొని లండన్ సెటిల్ అవ్వడం ఉత్తమమని కుంబ్లే అన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఈ నకిలీ వార్తలపై కుంబ్లే స్పందించాడు. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎక్స్వేదికగా స్పష్టం చేశాడు. 'కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నా ఫొటోను ఉపయోగిస్తూ నేను అనని మాటలు అన్నట్లు ఫేక్ పోస్ట్లు సృష్టించాయి. అవి నా దృష్టికి వచ్చాయి. ఆ ఖాతాలు.. వాటిలో సమాచారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు. ఇలాంటి వాటి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా వచ్చే ప్రతీదాన్ని నమ్మెద్దు. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు అది సరైనదో కాదో క్రాస్ చెక్ చేసుకోవాలి. నా అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి.'అని కుంబ్లే ఎక్స్ వేదికగా అభిమానులను కోరాడు.
గబ్బా టెస్ట్లో ఫాలో ఆన్ గండం తప్పించుకునేందుకు టీమిండియా పోరాడుతోంది. రెండో సెషన్ ముగిసే సమయానికి భారత్ 62.2 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(109 బంతుల్లో 6 ఫోర్లతో 65 బ్యాటింగ్)తో పాటు మహమ్మద్ సిరాజ్(1 బ్యాటింగ్) ఉన్నాడు. ఫాలో ఆన్ గండం గట్టెక్కేందుకు భారత్ ఇంకా 45 పరుగులు చేయాలి. మరోవైపు టీమిండియాను ఫాలో ఆన్ ఆడించి విజయం సాధించాలనే లక్ష్యంతో ఆసీస్ ఉంది.