టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజయం సాధించాలంటే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో ఉండాలని దిగ్గజ ప్లేయర్ అనిల్ కుంబ్లే తెలిపాడు. టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారనే ప్రచారంపై అతను ఘాటుగా స్పందించాడు. విరాట్ కోహ్లీ దూకుడు జట్టు విజయకాంక్షను రగిలిస్తుందని చెప్పాడు.
ఈ తరం క్రికెట్లోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటరని కొనియాడాడు. 'విరాట్ కోహ్లీ నిలకడైన బ్యాటర్. అతన్ని నేను తొలిసారి ఆర్సీబీ జట్టులో సహచర ఆటగాడిగా చూశాను. అప్పుడే అండర్ 19 ప్రపంచకప్ గెలిచి ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత అతను తన కెరీర్ను మలుచుకున్న తీరు అద్భుతం.

ఫిట్నెస్తో పాటు ఆట పరంగా ఎంతో మెరుగయ్యాడు. టెస్ట్ క్రికెట్లో అతను సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20ల్లోనే నిలకడగా రాణించి అసాధారణ విజయాలు అందించాడు. ముఖ్యంగా అతని దూకుడుతో జట్టులో విజయకాంక్షను రగిల్చాడు. మూడు ఫార్మాట్లలో ఈ తరం అత్యుత్తమ క్రికెటర్గా అతన్ని నేను గౌరవిస్తాను.
అంతటి సత్తా కలిగిన ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశించాలి.'అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.
గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ ఆటకు దూరంగా ఉన్నాడు. తన సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్తో అతను మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది అఫ్గానిస్థాన్తో జరిగిన టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్లు ఆడి 0, 29 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ 2024కు ఆతిథ్యం ఇవ్వనుండగా.. అక్కడి స్లో పిచ్లు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలికి సెట్ కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.