అభిమానిని తోసేసిన సెక్యూరిటీ గార్డ్.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్!(వీడియో)
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. అఫ్గాన్తో వన్డే సిరీస్ను ముగించుకున్న రోహిత్ శర్మ.. ఇటీవలే తన స్వస్థలం ముంబైకి చేరుకున్నాడు. అయితే ముంబై విమానాశ్రయంలో అభిమానులు సెల్ఫీల కోసం రోహిత్ చుట్టుముట్టారు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు దగ్గరగా వచ్చిన ఓ అభిమానిని సెక్యూరిటీ గార్డ్ పక్కకు నెట్టేశాడు.
సెక్యూరిటీ గార్డ్ దురుసు ప్రవర్తనపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సదరు సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ మందలించాడు. అభిమానులను అలా ట్రీట్ చేయవద్దని సూచించాడు. ఈ చర్యతో ఫ్యాన్స్ పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఈ ఘటనను ఫొటోగ్రాఫర్ పల్లవ్ బలివాల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది. రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

దుమ్మురేపిన రోహిత్..
అఫ్గానిస్థాన్తో మూడు వన్డేల సిరీస్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి మ్యాచ్లో 16 పరుగులతో రనౌట్గా వెనుదిరిగినా.. రెండో మ్యాచ్లో 48, మూడో మ్యాచ్లో 79 పరుగులతో రాణించాడు. ఈ సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జులైలో జరిగే మూడు వన్డేల సిరీస్లో రోహిత్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. అయితే అఫ్గానిస్థాన్తో సిరీస్లో రాణించడం రోహిత్ శర్మకు ఉపశమనం కలిగించిందని మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అన్నాడు.
స్వేచ్ఛగా ఆడుతాడు..
ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ ప్రశాంతంగా ఆడుతాడని చెప్పాడు. 'ఎంత గొప్ప ఆటగాడికైనా పరుగులు చేయడం అవసరం. రోహిత్ బ్యాటింగ్ చేసిన తీరు అతని గొప్ప సామర్థ్యాన్ని చూపించింది. అతను పరుగులు చేయడం చాలా ముఖ్యం. టీమ్మేనేజ్మెంట్ అతనికి నిరంతరం మద్దతు ఇస్తున్నప్పటికీ ఒక ఆటగాడిగా పరుగులు చేయనప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఫామ్ అందుకోవడం రోహిత్కు ఉపశమనం ఇచ్చి ఉంటుంది. ఇంగ్లండ్లో మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడు.
అక్కడి పిచ్లు కూడా రోహిత్ బ్యాటింగ్కు సరిగ్గా సరిపోతాయి. బ్యాటింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లోనూ రోహిత్ అదరగొట్టాడు. వరుసగా మూడు క్యాచ్లు అందుకున్నాడు. ఇప్పుడు అతను మనశ్శాంతితో ఇంగ్లండ్కు వెళ్లవచ్చు.'అని జియో హాట్స్టార్ షోలో పుజారా అన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలై 14 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

