
లండన్: ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిందని, ఇప్పుడు ఆ జట్టును ఓండించడం అంత సులువైన పని కాదని జింబాబ్వే మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నాడు. భారత్-ఇంగ్లండ్ అప్కమింగ్ నాలుగు టెస్ట్ల సిరీస్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడి ఫ్లవర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక 2012లో అలిస్టర్ కుక్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు భారత్లో 2-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఆ సమయంలో ఫ్లవర్ ఇంగ్లండ్ టీమ్కు కోచ్గా ఉన్నారు. అయితే నాటి జట్టు కంటే ప్రస్తుత భారత జట్టు బలంగా ఉందన్నాడు.
'భారత్తో టెస్ట్ సిరీస్ క్లిష్టమైన సవాళ్లతో కూడుకున్నది. అప్పటి మా టీమ్ కంటే ఇప్పటి ఇంగ్లండ్ జట్టుకు అది ఇంకా కష్టం. ఆస్ట్రేలియాపై విజయం సాధించాక టీమిండియా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లోనే చాలా బలమైన జట్టుగా కనిపిస్తోంది. అయితే, మేం భారత్లో పర్యటించినప్పుడు అలిస్టర్ కుక్ ఎలా రాణించాడో ఇప్పుడు జోరూట్ కూడా అలాగే ఆడాలి. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ భారీ పరుగులు చేయాలి.

తర్వాత బట్లర్, బెన్స్టోక్స్ లాంటి ఆటగాళ్లు అతనికి అండగా నిలివాలి. వారు కెవిన్ పీటర్సన్ మాదిరి. ఈ ముగ్గురూ చెలరేగి టీమిండియాపై ఒత్తిడి తీసుకురావాలి' అని ఫ్లవర్ పేర్కొన్నాడు. ఇక 2012లో అలిస్టర్ కుక్, పీటర్సన్ ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. వారిద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారీగా పరుగులు చేశారు.
ఇక తాజా సిరీస్ కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు బుధవారమే చెన్నై చేరుకున్నారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. టీమిండియా ఆటగాళ్లు సైతం క్వారంటైన్లోనే ఉన్నారు. ఇక వచ్చేనెల 5 నుంచి ఇరు జట్లూ చెన్నై వేదికగా తొలి టెస్టు, 13 నుంచి రెండో టెస్టు ఆడనున్నాయి. ఆపై 24 నుంచి మూడో టెస్టు, మార్చి 4 నుంచి నాలుగో టెస్టు అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియం వేదికగా జరగనున్నాయి.