
ముందే తెలుసు..
ఈ వ్యాఖ్యలపై ఆండ్రూ రస్సెల్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ''ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకెప్పుడో తెలుసు. అయితే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే మేలు'' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్ టోర్నమెంట్' ఆడుతున్న ఆండ్రూ రస్సెల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనను బలిపశువును చేసేందుకు విండీస్ మేనేజ్మెంట్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ముందే ఊహించానని చెప్పాడు. ఈ విషయంలో స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండటమే మంచి భావించానని చెప్పాడు.

రెండు ప్రపంచకప్లు గెలవాలని..
'విండీస్ కోచ్ వ్యాఖ్యల విషయంలో నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటున్నా. ఇంతకుముందు జరిగిన చర్చల్లో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. అందుకే ఇప్పుడు నన్ను చెడ్డవాడిగా చేసి.. బలిపశువులా బస్సు కిందకు తోసేయాలని చూస్తున్నారు. ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించా. విండీస్ జట్టుతో ఆడాలని, రెండు ప్రపంచకప్లను గెలవాలని ఉంది. అయితే అలాంటి అవకాశం ఉందని మాత్రం చెప్పలేను. నిజాయితీగా చెప్పాలంటే.. ఫ్రాంచైజీ తరఫున ఆడేటప్పుడు రెండు సెంచరీలు చేశా.

ఆ రెండు సెంచరీలు..
ఇవి విండీస్ జట్టుకు ఆడినప్పుడు చేయాల్సినవి. అయితే జమైకా తల్లాహస్కు ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా. ఒకవేళ ఆ రెండు సెంచరీలు విండీస్ తరఫున చేసి ఉంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక స్థానం ఉండేది. ఎప్పుడూ జట్టు కోసం ఆడాలనేదే నా కోరిక. అయితే కొన్ని నిబంధనలు అంగీకరించలేని పరిస్థితి. కనీసం నా నిబంధనలను గౌరవిస్తే బాగుండేది. మాకూ కుటుంబాలు ఉన్నాయి. కెరీర్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఏడాదిగా జట్టుకు దూరం..
ఇప్పుడు నా వయస్సు 34 ఏళ్లు. ఇప్పటికీ విండీస్ కోసం ప్రపంచకప్లను గెలిపించాలని భావిస్తున్నా'' అని ఆండ్రూ రస్సెల్ వివరించాడు. విండీస్ తరఫున ఆండ్రూ రస్సెల్ తన చివరి వన్డే మ్యాచ్ను 2019లో ఆడగా.. ఆఖరి టీ20 గతేడాది ఆసీస్ మీద ఆడాడు. భారత టీ20 లీగ్ సహా పలు దేశీయ లీగుల్లో రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












