కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎద్దులా ఉన్న రస్సెల్.. జోకర్లా మారడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆండ్రీ రస్సెల్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో రస్సెల్.. 4, 5, 1, 7, 17 , 21 పరుగులే చేశాడు. బౌలింగ్లో ఐదు ఇన్నింగ్స్ల్లో 6 వికెట్లు తీసాడు.
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రస్సెల్..15 బంతుల్లో 21 పరుగులే చేసి వెనుదిరిగాడు. 199 పరుగుల లక్ష్యచేధనలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన రస్సెల్.. కేవలం ఓ సిక్స్, మూడు బౌండరీలు బాది రషీద్ ఖాన్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. బౌలింగ్లో ఒకే ఒక్క ఓవర్ వేసి 13 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్లో అతని పేలవ ఫామ్ కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. పంజాబ్ కింగ్స్తో 111 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ చేధించలేకపోయింది. క్రీజులో ఉండి గెలిపించాల్సిన రస్సెల్ ఆఖరి వికెట్గా వెనుదిరిగి జట్టు ఓటమికి కారణమయ్యాడు.

గత సీజన్లో 19 వికెట్లతో పాటు 222 పరుగులు చేసిన రస్సెల్ను కేకేఆర్ రూ. 12 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఒకప్పుడు ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించిన రస్సెల్.. ఇప్పుడు భారీ షాట్లు ఆడేందుకే తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే రస్సెల్ పని అయిపోయిందని, అతన్ని తుది జట్టులో నుంచి తప్పించడం ఉత్తమమని ఫ్యాన్స్.. కేకేఆర్కు సూచిస్తున్నారు. ఈ సీజన్తోనే రస్సెల్ కెరీర్ ముగిసినట్లేనని, వచ్చే సీజన్లో అన్సోల్డ్గా నిలుస్తాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రస్సెల్ కారణంగా కేకేఆర్కు రూ. 12 కోట్ల బొక్క అని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన కేకేఆర్.. మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇంకా 6 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్ల్లో ఐదు గెలవాలి. అప్పుడే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, నెట్రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. మూడు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.