టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారి చేసిన ఆరోపణలు రాజకీయ మలుపు తీసుకున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో తనను ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని హనుమ విహారి ఆరోపించిన విషయం తెలిసిందే. జట్టులో 17వ ఆటగాడైన ఓ యువ క్రికెటర్ను మందలించడంతో రాజకీయనాయకుడైన ఆయన తండ్రి ద్వారా అసోసియేషన్పై ఒత్తిడి చేసి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని హనుమ విహారి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేశాడు.
భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు ఆంధ్ర జట్టును ఐదుసార్లు నాకౌట్ చేర్చిన తనకంటే ఓ యువ క్రికెటర్కు ప్రాధాన్యం ఇవ్వడం తనకు నచ్చలేదని, జీవితంలో మళ్లీ ఆంధ్ర జట్టుకు ఆడానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై సదరు యువ ప్లేయర్, వికెట్ కీపర్ కేఎన్ పృథ్వీ రాజ్ కూడా ఘాటుగా స్పందించాడు.

సానుభూతి కోసం విహారి ప్రయత్నిస్తున్నాడని తెలిపాడు. దాంతో సదరు ప్లేయర్ తండ్రి, రాజకీయ నాయకుడు ఎవరా? అనేది తెలిసింది. తిరుపతి కార్పోరేటర్ కే నరసింహాచారి తన పలుకుబడితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై ఒత్తిడి తెచ్చాడని, క్రికెట్లో రాజకీయ నాయకుల పెత్తనం ఏంది? అనే విమర్శలు వచ్చాయి.
తాజాగా సదరు కార్పోరేటర్ నరసింహాచారి ఈ వ్యవహారంపై స్పందించారు. తన కొడుకును తిట్టిన హనుమ విహారిపై అసోసియేషన్కు ఫిర్యాదు చేసానని అంగీకరించారు. కానీ అసోసియేషన్ను రాజకీయంగా ప్రభావితం చేయలేదన్నారు. అంతగా ప్రభావితం చేసే స్థాయి ఉంటే తన కుమారుడు జట్టులో 17వ ప్లేయర్గా ఎందుకు ఉండేవాడని ప్రశ్నించారు.
'నా కొడుకు కేఎన్ పృథ్వీ రాజ్ అండర్ 12, 14, 17, 19 క్రికెట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వికెట్ కీపర్గా.. బ్యాటర్గా మంచి గణంకాలు నమోదు చేశాడు. ప్రతిభ ఆధారంగానే అతను జట్టుకు ఎంపికయ్యాడు. అయినా అతనికి ఒక్క రంజీ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.
అందరూ అన్నట్లుగా రాజకీయంగా నాకు ప్రభావితం చేసే స్థాయి ఉంటే నా కుమారుడు పృథ్వీ రాజ్ను ఏకంగా కెప్టెన్ను చేయమని అడిగేవాడిని కదా..? లేదా కనీసం రంజీ మ్యాచ్ ఆడించమని చెప్పించేవాడిని కదా? అని ప్రశ్నించాడు. భారత జట్టు ఆడిన హనుమ విహారి ఆలోచనలు ఆ స్థాయిలోనే ఉండాలి.
సహచర ఆటగాళ్ల పట్ల హుందాగా వ్యవహరించాలి. అతను ఉద్దేశపూర్వకంగా నా కొడుకును తొక్కేసే ప్రయత్నం చేశాడు. నా కొడుకును అకారణంగా తిట్టాడు. దాంతోనే అసోసియేషన్కు ఫిర్యాదు చేశాం. త్వరలోనే విహారి చేసిన తప్పిదాలన్నిటినీ ఆధారాలతో సహా ముందుకు తీసుకువస్తాను.'అని కే నరసింహా చారి తెలిపారు.