టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ లింగమార్పిడితో పూర్తిగా అమ్మాయిగా(అనయ బంగర్)గా మారిపోయాడు. ఈ విషయాన్ని అనయా బంగర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ శస్త్రచికిత్సకు తన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని తెలిపింది. తన తండ్రి సంజయ్ బంగర్ అండగా నిలిచారని భావోద్వేగానికి లోనైంది.
ఆసుపత్రిలో తన తండ్రి సంజయ్ బంగర్తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అనయా పంచుకుంది. 'ఈ ప్రయాణం మాకు అంత సులువుగా ఏమీ సాగలేదు. నన్ను అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి నా కుటుంబానికి కొంత సమయం పట్టింది. ఎన్నో సందేహాలు, గందరగోళాలు ఉన్నప్పటికీ, చివరికి నా తండ్రి నాకు కొండంత అండగా నిలిచారు. ఆయన చూపించిన ప్రేమ వల్లే నేను ఈ పెద్ద అడుగు వేయగలిగాను’ అని అనయ తన పోస్ట్లో రాసుకొచ్చింది.

పుట్టినప్పుడు మగబిడ్డగా జన్మించిన అనయా.. ఆర్యన్గా ఏజ్ క్రికెట్ కూడా ఆడింది. ముంబై అండర్ 16, అండర్ 23 జట్లకు ప్రాతినిథ్యం వహించింది. తనలో అమ్మాయిల లక్షణాలు ఉండటంతో 2023లో హర్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకుంది. థెరపీ వల్ల శరీరంలో వచ్చిన మార్పులతో క్రికెట్ ఆడటంలో సవాళ్లు ఎదురయ్యాయి. దాంతో ఆమె క్రీడా జీవితం ప్రభావితమైంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రయాణంలో ఎదుర్కొన్న వేధింపులు, కష్టాల గురించి అనయా ధైర్యంగా మాట్లాడారు. మొదట్లో అనయా నిర్ణయాన్ని సంజయ్ బంగర్ కుటుంబం అంగీకరించలేదు.
ఐసీసీ రూల్స్ ప్రకారం.. పురుషులుగా పుట్టి.. ఆ తర్వాత మహిళలుగా మారిన వారికి అంతర్జాతీయ మహిళల క్రికెట్ ఆడటానికి అనుమతి లేదు. భద్రత, క్రీడా సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ పేర్కొంది.
బీసీసీఐ కూడా ఐసీసీ రూల్స్నే అనుసరిస్తుంది. ఇప్పటి వరకు దేశవాళీ మహిళల క్రికెట్లో ట్రాన్స్జెండర్ క్రీడాకారుల భాగస్వామ్యంపై బీసీసీఐ ఎలాంటి ప్రత్యేక సానుకూల విధానాన్ని ప్రకటించలేదు. ప్రస్తుత క్రీడా నిబంధనల ప్రకారం, అనయా భారత మహిళల జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యం. అయితే, క్రీడా ప్రపంచంలో లింగ వివక్ష , ట్రాన్స్జెండర్ల హక్కులపై చర్చలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో నిబంధనలు మారితే తప్ప ఆమెకు అవకాశం దక్కకపోవచ్చు.