టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల వ్యక్తిత్వం గురించి వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ క్రికెటర్గా ఎదిగిన తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని, ఆటగాళ్ల స్నేహానికి దూరమయ్యాడని తెలిపాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఎంత ఫేమ్ వచ్చినా.. మొదటి రోజు ఎలా ఉన్నాడో ఇప్పటికే అలానే ఉన్నాడని చెప్పాడు.
ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీకి స్నేహితులే లేరని ఈ ఢిల్లీ స్పిన్నర్ పేర్కొన్నాడు. ఏజ్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీతో కలిసి ఆడుతున్న తనకు అతని ఫోన్ నెంబర్ కూడా తెలియదన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ మిశ్రా.. కోహ్లీ, రోహిత్కు తేడాను వివరించాడు.

'నేను అబద్దం చెప్పడం లేదు. ఓ క్రికెటర్గా విరాట్ కోహ్లీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. రోహిత్, కోహ్లీ వ్యక్తిత్వాలు వేర్వేరు. రోహిత్ శర్మలో నచ్చే అంశం ఏంటంటే.. నేను మొదటిసారి కలిసినప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కలిసినా అలానే ఉంటాడు. కానీ కోహ్లీ మాత్రం పరిస్థితులకు తగ్గట్లు పూర్తిగా మారిపోయాడు.
నేను భారత జట్టులో లేక చాలా రోజులు అయ్యింది. ఇప్పటికీ ఐపీఎల్ సందర్భంగా రోహిత్ను కలిస్తే.. అతను నాతో చాలా సరదాగా ఉంటాడు. అతను ఏం అనుకుంటాడో అనే ఆలోచన కూడా నాకు రాకుండా సన్నిహితంగా వ్యవహరిస్తాడు.మేం ఒకరిపై ఒకరం జోక్స్ వేసుకుంటాం. అతను స్టార్ ప్లేయర్గా ఉన్నా.. తనతో నా ర్యాపో అలానే ఉంది. ప్రపంచకప్తో పాటు ఐదు టైటిల్స్ గెలిచిన కెప్టెన్ అతను.
విరాట్ కోహ్లీ మాత్రం చాలా మారిపోయాడు. మేం ఇద్దరం మాట్లాడుకోక చాలా రోజులు అయ్యింది. ఫేమ్, పవర్ వచ్చినప్పుడు చాలా మంది తమ సన్నిహితులను కారణం లేకుండానే మర్చిపోతుంటారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. 14 ఏళ్ల నుంచి నాకు చీకూ(కోహ్లీ ముద్దు పేరు) తెలుసు. అతను సమోసాలు, రాత్రిల్లో పిజ్జా తినేవాడు. కోహ్లీ, చీకూకు చాలా తేడా ఉంది. ఎప్పుడైనా అతను నన్ను కలిస్తే మర్యాదపూర్వకంగా కనిపిస్తాడు. కానీ చీకూలా వ్యవహరించడు.'అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున 22 టెస్ట్లు, 33 వన్డేలు, 10 టీ20లు ఆడిన అమిత్ మిశ్రా.. కోహ్లీ సారథ్యంలోనే 9 టెస్ట్లు, 7 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో అతను చివరి సారిగా టీమిండియాకు ఆడాడు. కెప్టెన్గా తనను తప్పించాడనే కోపంతోనే అమిత్ మిశ్రా కోహ్లీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నాడని అతని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.