టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా అండగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి మ్యాచ్ నుంచి తప్పుకోవడం రోహిత్ శర్మ పీఆర్ స్టంట్ ఏ మాత్రం కాదని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ అలాంటోడు కాదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బ్యాటర్గా.. కెప్టెన్గా దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. ఆఖరి టెస్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే కొందరు ఇది రోహిత్ శర్మ పీఆర్ స్టంట్ అని విమర్శించారు.
తాజాగా ఈ విమర్శలపై స్పందించిన అమిత్ శర్మ.. పీఆర్ కోసం రోహిత్ శర్మ ఇలాంటి చిల్లర పనులు చేయడని స్పష్టం చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మను భర్తీ చేసే ఆటగాడు ఎవరో చెప్పాలని ప్రశ్నించాడు. 'అది ఏ మాత్రం పీఆర్ స్టంట్ కాదని నాకు అనిపిస్తోంది. అతని స్వభావం అలాంటిది కాదు. వ్యక్తిగతంగా అతను నాకు బాగా తెలుసు. పీఆర్ కోసం ఇలాంటి పనులు చేసే వ్యక్తి అతను ఏ మాత్రం కాదు.

ప్రస్తుతం టెస్ట్ల్లో అతన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరో చెప్పండి? అతనిలా ఒత్తిడిని తట్టుకునే ఆటగాడు ఉన్నాడా? అతను ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. కానీ అతనిలా ఒత్తిడిని తట్టుకునే ఆటగాడు ఎవరో చెప్పండి? కుర్రాళ్లకు అండగా ఉండటం ఖచ్చితంగా మంచి విషయమే. అతను అదే చేశాడు. ఆస్ట్రేలియా తుది జట్టును తప్పుకున్న ఒక్క కెప్టెన్ పేరు చెప్పండి?'అని విమర్శకులను అమిత్ మిశ్రా ప్రశ్నించాడు.
గతేడాది టెస్ట్ల్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 15 ఇన్నింగ్స్ల్లో అతను 10.93 సగటుతో 164 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని టెస్ట్ టీమ్ నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా చేరలేదు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో రోహిత్ శర్మ ఉంటాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.