న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అతను చేసిన చిన్న తప్పిదాన్ని పట్టుకున్న అభిమానులు.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ విజేతను ఉద్దేశించి అమిత్ మిశ్రా ట్వీట్ చేశాడు. అయితే అందులో గెలిచిన ఆస్ట్రేలియాను కాకుండా ఓడిన న్యూజిలాండ్ను విజేతగా పేర్కొంటూ అభినందనలు తెలిపాడు. మ్యాచ్ ఫలితం తెలియక అలా చేశాడో లేక ముందుగానే రాసిపెట్టుకొని ఉన్న ట్వీట్ను ఆతృతలో పోస్ట్ చేశాడో తెలియదు గానీ పప్పులో మాత్రం కాలేసాడు.''వరల్డ్కప్ గెలిచిన బ్లాక్కాప్స్కు శుభాకాంక్షలు. సమష్టి విజయం. చాలా బాగా ఆడారు''అని పేర్కొన్నాడు.
ఇక అతన్ని తప్పిదాన్ని గుర్తించిన నెటిజన్లు అమిత్ మిశ్రాను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ''అయ్యో అమిత్.. మ్యాచ్ చూడలేదా? ఏంటి?''అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. హే అమిత్.. నిద్రపోయావా? అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేశారు. తన తప్పిదం తెలుసుకున్న అమిత్ మిశ్రా వెంటనే తన ట్వీట్ను తొలగించినప్పటికీ.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఆ తర్వాత సరైన ట్వీట్ చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొంది. తొలి టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్వుడ్ (3/16) బౌలింగ్లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది.
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్లతో 53) రెండో వికెట్కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు.