గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు రోహిత్ సేన తెరదించింది. అయితే బౌండరీ లైన్పై సూర్య పట్టిన మ్యాచ్ విన్నింగ్ క్యాచ్పై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అది క్లియర్ సిక్స్ అని కొందరంటే.. ఔట్ అని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరు బౌండరీ రోప్ జరిపారని ఆరోపించారు. సరిగ్గా ఏడాది తర్వాత ఈ క్యాచ్ వెనుక ఉన్న మిస్టరీని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు.
ఆ ఫైనల్ మ్యాచ్కు అంబటి రాయుడు కామెంటేటర్గా వ్యవహరించాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సూర్య క్యాచ్పై రాయుడు స్పందించాడు. కామెంటేటర్ల సౌకర్యం కోసం బ్రాడ్ కాస్టర్స్ సిబ్బంది బౌండరీ లైన్ జరిపారని చెప్పాడు.

'ఆ ఫైనల్ మ్యాచ్ బ్రేక్ సమయంలో వరల్డ్ ఫీడ్ కామెంటేటర్ల సౌకర్యం కోసం బౌండరీ రోప్ను వెనక్కి జరిపి ఒక కుర్చీ, స్క్రీన్ ఏర్పాటు చేశారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యేముందు కుర్చీ, స్క్రీన్ తీసేసిన సిబ్బంది రోప్ను తిరిగి సెట్ చేయడం మర్చిపోయారు. అలా ఎవరికి తెలియకుండానే బౌండరీ సైజ్ పెరిగిపోయింది. ఈ విషయాన్ని మేం కామెంట్రీ బాక్స్ నుంచి గమనించాం. అదంతా దేవుడి ప్లాన్లా అనిపించింది.
బౌండరీ లైన్ జరపకుండా ఉంచితే మాత్రం సూర్య పట్టిన ఆ క్యాచ్ సిక్స్ అయ్యేదా? అంటే కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే సూర్య ఇంకాస్త ముందు నుంచి పరుగెత్తి క్యాచ్ పట్టేవాడేమో. ఏది ఏమైనా సూర్య పట్టిన క్యాచ్ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అది క్లియర్ క్యాచ్. ఆ రోజు లక్ భారత్వైపు ఉంది.'అని రాయుడు చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ విజయానంతరం వివాదాస్పదంగా మారిన ఈ క్యాచ్పై రాయుడి మాటలతో క్లారిటీ వచ్చేసింది. డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ను సూర్య బౌండరీ లైన్పై అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ను భారత్వైపు మలుపు తిప్పింది.