భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోంది. దాంతో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మూ లక్ష్యంగా పాక్ మిస్సైల్స్తో దాడులకు తెగబడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు. భద్రతాపరంగా సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ను అర్థంతరంగా రద్దు చేశారు. స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకు వెళ్లే వరకు ఒక స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి ఉంచారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పాకిస్థాన్ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియ సెక్టార్లలో పాక్ మిస్సైల్ దాడులకు పాల్పడింది. పాక్ ప్రయోగించిన 8 మిసైల్స్ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. సరిహద్దుల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఈ ఉద్రిక్తతల మధ్య టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. 'కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది'అనే మహాత్మ గాంధీ కొటేషన్ను రాయుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రాయుడి ట్వీట్ను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. పాకిస్థాన్కు మద్దతుగా ఈ ట్వీట్ ఉందని ఆరోపిస్తూ జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారు.
పాకిస్థాన్ వెళ్లిపోవాలని మండిపడుతున్నారు. ఇంకొందరు త్రీడీ గ్లాసెస్తో కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. భారత సైన్యానికి అండగా నిలవకుండా ఈ ట్వీట్స్ ఏంటని మండిపడుతున్నారు. రాయలేని పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరహా ప్రవర్తనతోనే రాయుడు తన కెరీర్ను నాశనం చేసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.
తన ట్వీట్కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అంబటి రాయుడు తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. తన ట్వీట్ను తొలగించకపోయినా.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. భారత సైనిక చర్యకు తాను వ్యతిరేకంగా ఈ పోస్ట్ పెట్టలేదని మరో రెండు ట్వీట్లలో స్పష్టం చేశాడు.
'జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఇతర దేశ సరిహద్దుల్లో శాంతి నెలకొలాని ప్రార్థిస్తున్నాను. అసమాన ధైర్యం, క్రమశిక్షణ, నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగలకు తగిన గుర్తింపు లభిస్తోంది. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. జైహింద్'అని వరుసగా ట్వీట్స్ చేశాడు. రాయుడు ఎంత ప్రయత్నించినా.. నెటిజన్లు మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.