టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. అతని టెక్నిక్లో ఎలాంటి లోపం లేదని చెప్పాడు. స్టార్ క్రికెటర్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేయడంతో విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 15 బంతుల్లో 6 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ బ్యాటింగ్ గురించి మాట్లాడిన అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతం విరాట్ కోహ్లీకి రంజీ ట్రోఫీ ఆడాల్సిన అవసరం లేదు. 81 సెంచరీలు చేసిన సమయంలో కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ బాగానే ఉంది. దాన్ని కొనసాగిస్తే సరిపోతుంది. ఎవ్వరూ అతనిపై ఒత్తిడి తీసుకురావొద్దు. అతనికి కాస్త సమయం కావాలి. అతని లోపల పరుగులు చేయాలనే ఆకలి అలానే ఉంది. అతనిపై కాస్త నమ్మకం ఉంచి గౌరవించాలి. ముఖ్యంగా అతన్ని ఒంటరిగా వదిలేయాలి'అని రాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ విఫలమైనా సౌరాష్ట్రపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించడంతో కోహ్లీని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్ తరహాలోనే మైదానం మొత్తం నిండిపోయింది. విరాట్ కోహ్లీ వైఫల్యం వారిని తీవ్రంగా నిరాశపరిచింది.
ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్తో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గురువారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఈ సిరీస్లో రాణించడం విరాట్ కోహ్లీకి కీలకం.