హైదరాబాద్: 'అంబటి తిరుపతి రాయుడు' క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ ఆటగాళ్లలో రాయుడు ఒక్కరు. మైదానంలో టన్నుల కొద్ది పరుగులు బాదిన ఈ తెలుగు తేజం.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్తో క్రికెట్కు గుడ్బై చెప్పారు.
రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. మూడు నెలల క్రితమే తన పొలిటికల్ ఎంట్రీపై రాయుడు హింట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు తాను సిద్దంగా ఉన్నానని సంకేతాలు పంపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీచ్లను కొనియాడిన రాయుడు.. తన రిటైర్మెంట్ ట్వీట్లోనూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రిటైర్మెంట్ అనంతరం రెండు సార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ను రాయుడు కలిసారు. తాజాగా ఓ ప్రముఖ తెలుగు చానెల్ నిర్వహించిన టాక్ షోలో రాజకీయాల గురించి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలా క్లారిటీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. తన ప్రాంతం అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు అంబటి రాయుడు స్పష్టం చేశారు. ఓ ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదని, అన్నీ వర్గాల వారు అభివృద్ధి చెందాలని వైఎస్సార్సీపీ ప్రత్యర్దులకు చురకలంటించారు. 'మా కృష్ట డెల్టా ప్రాంతం అభివృద్ధి కోసమే సీఎం వైఎస్ జగన్ను కలిసాను. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడమే నా లక్ష్యం.
ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మచిలీపట్నం పోర్ట్ ప్రకటించారు. దాని ఆధారంగా ఎన్నో ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. ఆ పోర్ట్ ద్వాారా ఎంతో అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఆ డెల్టా ప్రాంతాన్ని బంగారంగా చూడటమే నా డ్రీమ్..
యువకులు ఇంకా రాజకీయాల్లోకి రావాలి. ఆలోచనా విధానాల్లో మార్పులు రావాలి. అభివృద్ధి రెండు రకాలుగా ఉంటుంది. సోషల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్. ప్రతీ చోట ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ది కాదు. ఆ ప్రాంతానికి ఏది అవసరమో అది చేయాలి. మనకు చాలా పెద్ద సముద్ర తీరం ఉంది. మచిలీపట్నం పోర్ట్ ప్రారంభమైతే ఆంధ్రతో పాటు తెలంగాణ వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ప్రతీ ప్రాంతం, ప్రతీ గ్రామం అభివృద్ది చెందాలి. అందర్నీ ఒక్కచోటికి వచ్చేలా, అందరూ ఒక్క దగ్గరే ఉండాలనడం, పేదవారు మన ఇంట్లో పని చేయాలనడం పద్దతి కాదు. ప్రతీ వర్గం ఎదగాలి. ప్రతీ మనిషి డెవలప్ కావాలి. అదే నా లక్ష్యం. ఆ లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నాను.'అని రాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాయుడు కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.