హైదరాబాద్: క్రికెట్ కెరీర్కు ముగింపు పలికిన టీమిండియా మాజీ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తన సెకండ్ ఇన్నింగ్స్ పొలిటికల్ పిచ్పై ఉంటుందని పరోక్షంగా చేపట్టిన రాయుడు.. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి కష్టాలను తెలుసుకుంటున్నారు.
పొలిటికల్ ఎంట్రీకి ముందు ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అతి త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోని ప్రజాక్షేత్రంలో బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు.

తాజాగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆఫీస్ను సందర్శించిన అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ సోషల్ మీడియా ప్రతినిథులు అడిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అభిమాన పొలిటీషన్ ఎవరని ప్రశ్నించగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బదులిచ్చారు.
'నా ఫేవరేట్ పొలిటీషన్ కచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. ప్రజల్లో తిరిగి వారి కష్టాలను తెలుసుకున్న వ్యక్తి. ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న గొప్ప వ్యక్తి. అందరినీ సమంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న మంచి మనిషి.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఏపీ వాలంటరీ వ్యవస్థను కూడా రాయుడు కొనియాడారు. వాలంటరీ వ్యవస్థ గొప్పగా ఉందని, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. తన పర్యటనలో చాలా మంది ప్రజలు వాలంటరీ వ్యవస్థ బాగుందని చెప్పారని, వారి సేవలను మరింత విస్తృత పరచాలని కోరారని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని చెప్పిన రాయుడు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్న విషయం కానీ, వైఎస్సార్సీపీ పార్టీలో చేరే విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సమయం వచ్చినప్పుడు తానే అన్ని చెబుతానని ప్రకటించారు.
ముందుగా ప్రజా సేవలో నిలుస్తానని స్పష్టం చేసారు. వైఎస్సార్సీపీలో చేరే విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆయన ఆ పార్టీకి సన్నిహితంగానే నడుచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులను కొనియాడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి వైఎస్ జగన్ ట్వీట్ చేయగా.. అంబటి రాయుడు లైక్ చేశారు.