Ambati Rayudu: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటగాళ్ల సత్తాను బయటకు తీయడంలో ధోనీని మించినవాడు లేడని, ఎంతో మంది ఆటగాళ్లు మహీ సారథ్యంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారని తెలిపాడు.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ఫార్మాట్ ఏదైనా ఆటగాళ్ల సత్తాను బయటకు తీయడంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పోటీ లేదు. చివరకు అతను విదేశీ ఆటగాళ్ల నుంచి కూడా అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టగలడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిథ్యం వహించిన ఎందరో విదేశీ ఆటగాళ్లు ధోనీ సారథ్యంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు.

మైదానంలో ధోనీ తీసుకునే నిర్ణయాలు 99.9 శాతం రైట్ అవుతాయి. గత సీజన్లో అజింక్యా రహానే ప్రదర్శన చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ఎంతో అపార నైపుణ్యం ఉన్న రహానే.. దాన్ని బయటపెట్టుకోలేకపోయాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగినప్పుడు మాత్రం తన అసలు సిసలు సత్తాను బయటపెట్టాడు.
దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇదే ధోనీ సారథ్యం ఏంటో తెలియజేస్తోంది. ధోనీని ఎవరూ కూడా వేలెత్తి ప్రశ్నించరు. ఎందుకంటే అతను అంతలా సక్సెస్ సాధించాడు. కొన్నిసార్లు ధోనీ తప్పిదం చేశాడని అనుకునేవాడిని. కానీ చివరకు నేను అనుకున్నదే తప్పిదం అయ్యేది. ధోనీ నిర్ణయమే సరైనదిగా నిరూపితమయ్యేది.
మూడు ఫార్మాట్లలో ఆడిన అనుభవం.. సుదీర్ఘ కాలం పాటు టీమిండియాకు కెప్టెన్సీ చేయడంతో ధోనీకి ఆటపై పట్టు చిక్కింది. ధోనీ.. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా... చాలా కోపిష్టి. ఓ ప్లేయర్ 100 శాతం తన సత్తా చాటకపోయినా ఆగ్రహం వ్యక్తం చేయడు. కానీ అతను చెప్పిన సూచనలను పాటించకపోతే మాత్రం సీరియస్ అవుతాడు.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.