న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని ఆ జట్టు మాజీ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు అన్నాడు. ప్రస్తుత చెన్నై జట్టులో ధోనీ వారసుడిగా జట్టును నడిపించే సత్తా అతనికే ఉందని చెప్పాడు. అయితే ధోనీ మరో సీజన్ ఆడే అవకాశం ఉందని, ఆ తర్వాతనే రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు సీఎస్కేకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నాకు తెలిసి ధోనీ భాయ్ మరో సీజన్ ఆడుతాడు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు సారథి ఎవరు? అనే చర్చ అనవసరం. కానీ ఫ్యూచర్లో చెన్నై సారథ్య పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్ అందుకోవచ్చు. ఇప్పటికే ధోనీ కెప్టెన్సీలో అతను నాలుగు సీజన్లు ఆడాడు.

దేశవాళీ టోర్నీల్లోనూ కెప్టెన్గా సత్తా చాటుతున్నాడు. అతనిలో అసాధారణమైన టాలెంట్ ఉంది. నాకు తెలిసి సీఎస్కేను మరో పదేళ్ల పాటు నడిపించగల సత్తా రుతురాజ్ గైక్వాడ్కు మాత్రమే ఉంది. త్వరలోనే రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా మూడు ఫార్మాట్ల ప్లేయర్గా ఎదుగుతాడు.
రుతురాజ్ గైక్వాడ్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బీసీసీఐ కూడా గుర్తించింది.
ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా సక్సెస్ అయితే, సీఎస్కే ఫ్యూచర్ కెప్టెన్ రేసులో మిగిలిన అందరినీ అతను దాటేస్తాడు.'అని రాయుడు అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. బ్యాకప్ ప్లేయర్గా బెంచ్కే పరిమితమయ్యాడు.
పరిమిత ఓవర్ల సిరీస్లో అతనికి చోటు దక్కలేదు. అయితే ఆసియా గేమ్స్లో పాల్గొనే భారత జట్టుకు రుతురాజ్ను బీసీసీఐ కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ టోర్నీలో రుతురాజ్ సత్తా చాటితే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ కూడా అందుకోనున్నాడు. భారత జట్టులో కూడా చోటు దక్కించుకోనున్నాడు. కుడి చేతి వాటం బ్యాటర్ కావడంతోనే రుతురాజ్.. వెస్టిండీస్తో టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ధోనీకి బ్యాకప్ కెప్టెన్గా తీర్చిదిద్దాలని బెన్ స్టోక్స్ను కొనుగోలు చేసినా ఐపీఎల్ 2023 సీజన్లో అతను అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్లో రవీంద్ర జడేజా కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ తదుపరి కెప్టెన్ అవుతాడనే ప్రచారం జరుగుతోంది.