Ambati Rayudu: వన్డే ప్రపంచకప్ 2023లో రన్నరప్గా నిలిచిన టీమిండియాపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన ప్రపంచకప్ల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టే అత్యుత్తమమైనదని కితాబిచ్చాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపాలైనా.. టైటిల్ అందుకోకపోయినా రోహిత్ సేననే బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు.
తాజాగా 'దీ తన్వీర్ షో'అనే యూట్యూబ్ పోడ్కాస్ట్లో మాట్లాడిన రాయుడు తన వ్యక్తిగత కెరీర్తో పాటు వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా కంటే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు చాలా బలమైనదన్నాడు.

'2003 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మన కంటే చాలా బలమైనది. కానీ ఈ సారి మాత్రం టీమిండియానే బలంగా ఉంది. నేను చూసిన ప్రపంచకప్ల్లోని భారత జట్ల కంటే ప్రస్తుత టీమ్ ఉత్తమమైనది. ఆటగాళ్ల నైపుణ్యం, అనుభవం ప్రకారం 2011 ప్రపంచకప్ ఆడిన భారత జట్టు కూడా అత్యుత్తమమైనదే. కానీ ప్రస్తుతం జట్టు ఆడినట్లు గతంలో ఏ భారత జట్టు కూడా ఆడలేదు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
టీమ్మేనేజ్మెంట్ చేసిన తప్పిదాల కారణంగా తాను కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అర్థం పర్థం లేని లాజిక్స్తో సెలెక్టర్లు చేసిన తప్పిదంతో ప్రపంచకప్ ఆడకుండానే తన కెరీర్ ముగిసిందన్నాడు. 'ప్రతీ ఒక్కరి కథ భిన్నమైనది. కానీ నేను ఎవర్నీ ఏ సాయం కోరనందుకు సంతోషంగా ఉన్నాను.'అని రాయుడు బదులిచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. కీలక ఫైనల్లో మాత్రం ఆసీస్ చేతిలో తడబడింది. పేలవ బ్యాటింగ్తో పాటు దురదృష్టం కూడా తోడవ్వడంతో టైటిల్ అందుకోలేకపోయింది.