ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా సీఎస్కేలో చేరగానే.. అసాధారణ ప్రదర్శన కనబరుస్తారు. బ్యాటింగ్, బౌలింగ్.. వయసుతో సంబంధం లేకుండా మెరుగైన ప్రదర్శన చేస్తారు. సీఎస్కేలో చాలా వరకు వయసు పైబడిన ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు.
కెరీర్ చివరి దశలో ఉన్న ఆటగాళ్లకే ఆ ఫ్రాంచైజీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. దాంతో చెన్నైని డాడిస్ ఆర్మీగా పిలుస్తారు. ధోనీ గైడెన్స్లో ఎందరో వరల్డ్ క్లాస్ బౌలర్లుగా ఎదిగారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, మతీష పతీరణ వంటి బౌలర్లు సీఎస్కేలో చేరిన తర్వాత తమ ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నారు.

బ్యాటింగ్లో అంబటి రాయుడు, శివమ్ దూబే, అజింక్యా రహానే.. గతంలో షేన్ వాట్సన్ వంటి ఆటగాళ్లు సంచలన ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా శివమ్ దూబే విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. రహానే సైతం 2.0 వర్షన్ను తలపిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడిని ప్రశ్నింగా అతను అసలు కారణాన్ని వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్కు తెలుగు కామెంటేటర్గా వ్యవహరించిన అంబటి రాయుడు.. సహచర కామెంటేటర్ కళ్యాణ్ కృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎస్కే సక్సెస్ సీక్రెట్ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు కొత్తగా ఏం నేర్పించే ప్రయత్నం చేయదని, ప్లేయర్ల బలాలపైనే మరింత వర్క్ చేయిస్తుందని తెలిపాడు.
ఆటగాళ్ల బలాలను మరింత సానబెట్టి జట్టు విజయానికి తగ్గట్లు ఉపయోగించుకుంటుందన్నాడు. అందుకే అప్పటి వరకు ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెన్నై తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తారని చెప్పాడు. అంతేకాకుండా ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండేలా చూసుకుంటుందని, సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా ఆటగాళ్లందరినీ సమంగా చూసుకుంటుందని చెప్పాడు.
శివమ్ దూబే ఆటతీరుపై అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. అభిమానులంతా ధోనీ కోసం ఎదురు చూస్తుంటారని, దాంతోనే అతను ధాటిగా ఆడుతున్నాడని చమత్కరించాడు. గతేడాది తాను కూడా ఇలాంటి బాధనే ఎదుర్కొన్నానని, బ్యాటింగ్ చేయాలా? త్వరగా ఔటవ్వాలా? అనే సందిగ్దంలో బ్యాటింగ్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు.