హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ, విదేశాల నుంచి భాగ్యనగరానికి ఎవరూ వచ్చినా దమ్ బిర్యానీ తినాల్సిందే. అంతలా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. టీమిండియా క్రికెటర్లు సైతం హైదరాబాద్లో అడుగుపెడితే.. స్ట్రిక్ట్ డైట్ను పక్కనపెట్టి మరీ బిర్యానీని లాంగించేస్తారు. అయితే బిర్యానీ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్జం మహేంద్ర సింగ్ ధోనీ హోటల్నే మార్చేసాడంట. ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు తెలిపాడు.
తాజాగా ఓ తెలుగు యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా బిర్యానీ కోసం ధోనీ హోటల్ మారిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2014 సీజన్లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాడు. ఆ సమయంలో రాయుడు ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

'ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాద్కు వచ్చారు. ఆ జట్టులోని టీమిండియా క్రికెటర్లు సురేశ్ రైనా, ధోనీ ఇతర ఆటగాళ్లు మంచి బిర్యానీ తినిపించాలని కోరారు. నేను ఇంట్లో వండిన బిర్యానీని హోటల్కు పంపించాను. కానీ హోటల్ సిబ్బంది ఔట్ సైడ్ ఫుడ్ అనుమతి లేదని నిరాకరించారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ధోనీ.. హోటల్నే మార్చేసాడు. కొన్ని విషయాల్లో ధోనీ చాలా మొండిగా ఉంటారు. తనకు నచ్చకపోతే ఏమైనా చేసేందుకు రెడీ అవుతాడు. అప్పటి నుంచి ఆ హోటల్లో చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా ఆటగాళ్లు బస చేయడం లేదు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
క్రికెట్ పీఆర్లను నిషేధించాలని కూడా అంబటి రాయుడు డిమాండ్ చేశాడు. పీఆర్ల కారణంగా మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనపై సరైన విశ్లేషణ రావడం లేదన్నాడు. ఆడేది కొంచెమైతే.. బాగా ఎలెవెషన్లు ఇస్తున్నారని, గతంలో ఇలా ఉండేది కాదన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన కంటే పీఆర్ల డబ్బానే ఎక్కువైందన్నాడు. వారి కారణంగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అవకాశం దక్కడం లేదని చెప్పాడు.