టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో అతనిది కీలక పాత్రని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024 ముందు ఎదురైన క్లిష్ట పరిస్థితులను హార్దిక్ పాండ్యా మానసిక స్థైర్యంతో అధిగమించాడని ప్రశంసించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా డేంజరస్ డేవిడ్ మిల్లర్ను ఔట్ చేసి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు హెన్రీచ్ క్లాసెన్ను కూడా పెవిలియన్ చేర్చిన హార్దిక్ పాండ్యా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. రోహిత్ శర్మను తప్పించి ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ఇవ్వడాన్ని ఆ జట్టు అభిమానులు సహించలేకపోయారు. ప్రతీ మ్యాచ్ సందర్భంగా అతన్ని ఎగతాళి చేశారు.
దాంతో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఈ విమర్శలు, ట్రోల్స్కు ఏ మాత్రం బెదరని హార్దిక్ పాండ్యా మరింత కసిగా కష్టపడి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టీ20 ప్రపంచకప్లో అటు బంతితో ఇటు బ్యాట్తో సత్తా చాటాడు.ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేసిన వారికి అంబటి రాయుడు సవాల్ విసిరాడు. దమ్ముంటే ఇప్పుడు ఎగతాళి చేయాలని కోరాడు.

'ఇది హార్దిక్ పాండ్యా గొప్పతనం. అతని మానసిక స్థైర్యానికి నిదర్శనం. అందుకే అతన్ని ఎగతాళి చేసిన వారిని ఇప్పుడు చేయాలని సవాల్ విసురుతున్నాను. హార్దిక్ పాండ్యా ఓ అద్భుతమైన ఆటగాడు. అతనితో కలిసి నేను ఆడాను. అతను గొప్ప వ్యక్తి. అందుకే ఈ కష్టాలు, ట్రోలింగ్ను తట్టుకొని నిలబడ్డాడు. కొద్ది నెలల క్రితం అతను ఎంతటి మానసిక క్షోభ అనుభవించాడో మనందరికి తెలుసు. అతని కమ్ బ్యాక్ మాత్రం అసాధారణం. ఇప్పుడు అతను వరల్డ్ ఛాంపియన్.
అతను సుదీర్ఘ కాలంగా టీమిండియాకు మ్యాచ్ విన్నర్. మరోసారి తన సత్తా చూపించాడు. క్లాసెన్ వంటి కీలక వికెట్ తీసి మ్యాచ్ను టీమిండియావైపు మలుపు తిప్పాడు. చివరి ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రపంచకప్ను అందించాడు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.