రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. గత రెండు రోజులుగా ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కూడా ఆర్సీబీ ఈ సారి టైటిల్ గెలువద్దని గట్టిగా కోరుకుంటున్నానని కూడా తెలిపాడు. కానీ కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ సమష్టి ప్రదర్శనతో ఘన విజయం సాధించడంతో రాయుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.
ఆ మ్యాచ్ అనంతరమే ఆర్సీబీపై ప్రశంసల జల్లు కురిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 'ఈ సారి ఆర్సీబీ చాలా పటిష్టంగా ఉంది. టైటిల్ గెలిచే టీమ్లా కనిపిస్తోంది'అని తెలిపాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్పై ఆర్సీబీ ఘన విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులు రాయుడిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాయుడు ఎక్కడా? ఆర్సీబీ విజయాన్ని తట్టుకోగలుగుతున్నాడా? అని ప్రశ్నిస్తూ పోస్ట్లు పెట్టారు.

గతేడాది సీఎస్కేతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. ఆ సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు, ఫ్యాన్స్ టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో కామెంటేటర్గా ఉన్న రాయుడు.. ఆర్సీబీ జట్టుపై, అభిమానులపై తీవ్ర విమర్శలు చేశాడు. ఆర్సీబీ టైటిల్ గెలవదని ఫ్యాన్స్ను రెచ్చగొట్టాడు. అప్పటి నుంచి రాయుడు, ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ యుద్దం నడుస్తోంది. తాజా సీజన్లో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేయడంతో రాయుడిని ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఆర్సీబీ ఫ్యాన్స్ పేజీలో పెట్టిన ఓ పోస్ట్కు అంబటి రాయుడు స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయాన్ని ప్రస్తావిస్తూ రాయుడిపై అభిమానులు సెటైర్లు పేల్చారు.
'కామెంట్రీ ప్యానెల్లో ఉండాల్సిన ఓ కీలక వ్యక్తి గత రెండు గంటలుగా ఆన్లైన్లో మిస్సయ్యాడు. అతని గురించి మేం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాం. మీకు ఎవరికైనా తెలిస్తే మమ్మల్ని సంప్రదించండి. అంబటి రాయుడు బానే ఉన్నాడని ఆశిస్తున్నాం.'అని ఆర్సీబీ ఫ్యాన్స్ అఫిషియల్ పేజీలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్పై రాయుడు నవ్వుతూ స్పందించాడు. ఆర్సీబీ అభిమానుల సెటైర్లు బాగున్నాయని, ఈ ఏడాది వారికి తిరుగులేదని పేర్కొన్నాడు.
'హహహహ ఇది బాగుంది.. ఆర్సీబీ ఫ్యాన్స్. హరిహాసం అంటే ఇలా ఉండాలి. ఈ ఏడాది మీకు గొప్ప టీమ్ ఉంది. మీరు అత్యుత్తమ ఫలితాన్నిఆశించవచ్చు.'అని బదులిచ్చాడు. అంతకుముందు సీఎస్కే ఓటమిపై స్పందించిన రాయుడు.. ఆ జట్టు మిడిలార్డర్ బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే సీఎస్కే.. మిడిలార్డర్ను బలోపేతం చేసుకోవాలని సూచించాడు.