Ambati Rayudu: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2024 సీజన్ ఆడుతాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రస్తుతం మొకాలి గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ... ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమయ్యే సమయానికి ఫిట్గా ఉంటే బరిలోకి దిగుతానని తెలిపాడు. ఒకవేళ ధోనీ దూరమైతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నడిపించేది ఎవరా? అనేది తేలాల్సి ఉంది. ఐపీఎల్ 2022 సీజన్లో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్కే ఫ్రాంచైజీ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. దాంతో అతన్ని నమ్ముకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ను నడిపించే ఆటగాడు ఎవరా? అని ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడిని ప్రశ్నించగా అతను ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఓ యూట్యూబ్ చానెల్లో షోలో పాల్గొన్న రాయుడు.. రుతురాజ్ గైక్వాడ్కు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. 'నాకు తెలిసి రుతురాజ్ గైక్వాడ్కు తదుపరి సీఎస్కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్తో తన ప్రయాణం అద్భుతమని చెప్పిన రాయుడు.. సీఎస్కేతో జర్నీ మరిచిపోలేనిదని తెలిపాడు. 'నేను ఎక్కువ కాలం ముంబై ఇండియన్స్ జట్టులోనే ఆడాను. 8 ఏళ్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. ఇది గొప్ప ప్రయాణం. మేం మూడు టైటిళ్లతో పాటు రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీ గెలిచాం. ముంబైతో నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరడం మరింత ప్రత్యేకం. జట్టు మారడాన్ని ఆరంభంలో జీర్ణించుకోలేకపోయాను. మరొక డ్రెస్సింగ్ రూమ్లో.. బ్లూ కలర్ ప్యాడ్స్ కాకుండా పసుపు ప్యాడ్లు ధరించి.. నాకు లైఫ్ ఇచ్చిన ముంబై ఇండియన్స్ను ఎదుర్కోవడం విచిత్రంగా అనిపించింది.
నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చింది. ఆ తర్వాత సీఎస్కేకు ఆడటం అలవాటైంది.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 సీజన్లో రవీంద్ర జడేజా సారథ్యంలో వరుసగా 4 మ్యాచ్లు ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారిపట్టింది. దాంతో మళ్లీ సారథ్య బాధ్యతలు అందుకున్న ధోనీ.. ఐపీఎల్ 2023 సీజన్లో జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ సీజనే ధోనీకి చివరిదని భావించినా.. అతను మరో సీజన్ ఆడుతానని తెలిపాడు. మొకాలికి శస్త్రి చికిత్స తీసుకున్న అతను.. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు.
మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న ధోనీ.. తన వ్యాపార కార్యకలపాలతో పాటు ఫామ్ హౌజ్లో వ్యవసాయం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ అనుభవం ఉంది. ఏషియన్ గేమ్స్ 2023లో రుతురాజ్.. కుర్రాళ్లతో కూడిన టీమిండియాకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ అందించాడు.