ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ-ఆడమ్ జంపా మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ లెగ్ స్పిన్నర్లకు తడబడ్డాడని, కానీ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న అతను ఆడమ్ జంపాపై చెలరేగుతాడని అభిప్రాయపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్లకు మూడు గెలిచిన టీమిండియా అదే జోరులో ఆసీస్ను ఓడించి ఫైనల్కు చేరాలనుకుంటోంది. 2017 నుంచి విరాట్ కోహ్లీని వన్డేల్లో ఆడమ్ జంపా ఐదు సార్లు ఔట్ చేశాడు. ఈ ఆసీస్ లెగ్ స్పిన్నర్ కోహ్లీకి 245 పరుగులిచ్చి 73 డాట్ బాల్స్ ఇచ్చాడు. దాంతో సెమీఫైనల్లో ఈ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇదే విషయాన్ని జియో హాట్ స్టార్ షోలో అంబటి రాయుడు ప్రస్తావిస్తూ మరింత హైప్ క్రియేట్ చేశాడు. 'ఆడమ్ జంపా- విరాట్ కోహ్లీ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ మధ్య విరాట్ కోహ్లీ లెగ్ స్పిన్నర్లకు తడబడ్డాడు. కానీ ప్రస్తుతం అతను ఉన్న ఫామ్లో ఆడమ్ జంపాపై సునాయసంగా పైచేయి సాధిస్తాడు.'అని తెలిపాడు.
న్యూజిలాండ్తో మ్యాచ్తో 300 వన్డేల మైలురాయి అందుకున్న విరాట్ కోహ్లీకి రాయుడు అభినందనలు తెలిపాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో కోహ్లీ ఔటయ్యాడని తెలిపాడు.'కోహ్లీకి పరుగులు చేయాలనే ఇంటెంట్ అలానే ఉంది. అతనిపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పరుగులు చేయాలనే ఆకలిని కోహ్లీ కళ్లలో చూడవచ్చు. బిగ్ మ్యాచ్ల్లో కోహ్లీ సవాళ్లను స్వీకరించి అభిమానులకు మధురమైన క్షణాలను అందిస్తాడు. దురదృష్టవశాత్తు గ్లేన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో అతనికి కలిసిరాలేదు. కానీ సెమీస్లో అతను చెలరేగుతాడు. అతని అత్యుత్తమ ప్రదర్శనను అందరూ చూడాలనుకుంటున్నారు. అభిమానుల నుంచి అతనికి పూర్తి మద్దతు ఉంది.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.