టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కారణంగానే తన కెరీర్ నాశనమైందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తెలుగు తేజం అంబటి రాయుడు స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీనే తనకు అవకాశాలు ఇచ్చాడని తెలిపాడు. 2019 వన్డే ప్రపంచకప్ ముందు అంబటి రాయుడిని జట్టులో నుంచి తప్పించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అప్పటి వరకు వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడిన అంబటి రాయుడిని కాదని ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎంపిక చేశారు.
బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ చేయగల 3డీ ప్లేయర్ విజయ్ శంకర్ అని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'వరల్డ్ కప్ మ్యాచ్లు చూసేందుకు తాను 3D గ్లాసెస్ ఆర్డర్ చేశాను'అని ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ట్వీట్పై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత శంకర్, శిఖర్ ధావన్ గాయపడినా.. రిజర్వ్ ప్లేయర్గా ఉన్న రాయుడికి బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే రాయుడికి అవకాశం దక్కలేదని అప్పట్లో చాలా మంది అభిమానులు ఆరోపించారు.

కోహ్లీ వల్లే రాయుడిపై వేటు..
అయితే విరాట్ కోహ్లీ కారణంగానే రాయుడికి అవకాశం దక్కలేదని ఓ ఇంటర్వ్యూలో రాబిన్ ఊతప్ప తెలిపాడు. తనకు నచ్చని ఆటగాళ్లను కోహ్లీ జట్టు నుంచి తప్పిస్తాడని, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ కెరీర్ మధ్యలోనే ముగియడానికి కోహ్లీనే కారణమని ఊతప్ప తెలిపాడు. 2019 వన్డే ప్రపంచకప్ కోసం రాయుడు అన్ని విధాల సిద్దమయ్యాడని, అతన్ని చివరి నిమిషంలో జట్టు నుంచి తప్పించడం అన్యాయమని కూడా ఊతప్ప చెప్పుకొచ్చాడు.
కోహ్లీ వల్లే నాకు అవకాశం..
తాజాగా ఈ వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించాడు. Raw Talks With VK అనే తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు తన కెరీర్కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'విరాట్ కోహ్లీ ఇష్టాల గురించి రాబిన్ ఊతప్ప చెప్పాడు. అయితే నా విషయంలో అతను చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. ఎందుకంటే టీమిండియాలో నాకు అవకాశాలు ఇచ్చిందే విరాట్ కోహ్లీ. నా ఆట అంటే కోహ్లీకి చాలా ఇష్టం. కోహ్లీ సారథ్యంలోనే నేను ఎక్కువ మ్యాచ్లు ఆడాను. ఇద్దరం కలిసి భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాం.
భారత జట్టులోకి రావడానికి ఎంత కష్టపడాలో అతనికి బాగా తెలుసు. విరాట్ కోహ్లీ ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చాడు. నా కెరీర్లోని కష్టాలన్ని అతనికి తెలుసు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ నాకు అండగానే నిలిచాడు. కోహ్లీ మద్దతు లేకుంటే టీమిండియా తరఫున నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడిని కాదు. నా గురించి రాబిన్ ఊతప్ప చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదు.'అని అంబటి రాయుడు స్పష్టం చేశాడు.