న్యూఢిల్లీ: భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అభినందనలు తెలిపాడు. భారత జట్టు తరఫున ప్రతీ ఫార్మాట్లో తిలక్ వర్మకు సూపర్ కెరీర్ ఉందని కొనియాడాడు. వెస్టిండీస్ పర్యటనలో దుమ్మురేపాలని ఆకాంక్షించాడు.
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో పోటీ పడే భారత టీ20 జట్టుకు 20 ఏళ్ల తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ బుధవారం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీ20 జట్టును ప్రకటించింది. తిలక్ వర్మతో పాటు యశస్వీ జైస్వాల్కు తొలిసారి టీ20 పిలుపు అందింది.

కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ.. ఐపీఎల్లో చెలరేగడంతో తిలక్ వర్మకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. హైదరాబాద్లో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తిలక్ వర్మ ఒక్కో అడుగు వేస్తూ టీమిండియా ఆటగాడిగా ఎదిగాడు. వికెట్కు విలువనిస్తూ ఓపిగ్గా క్రీజులో నిలవడమే కాకుండా.. అవసరమైనపుడు భారీ షాట్లతో విరుచుకుపడే నైపుణ్యమూ తిలక్లో ఉంది.
ఈ క్రమంలోనే తిలక్ వర్మకు మంచి భవిష్యత్తు ఉందని గతంలో భారత దిగ్గజ ఆటగాళ్లు కొనియాడారు. తిలక్ వర్మ ఎంపికపై ట్విటర్ వేదికగా స్పందించిన అంబటి రాయుడు.. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటాలని సూచించాడు.
'వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ఎంపికైన తిలక్ వర్మకు అభినందనలు. టీమిండియా తరఫున ప్రతీ ఫార్మాట్లో అతనికి మంచి కెరీర్ ఉంది. వెస్టిండీస్ పర్యటనలో సత్తా చాటాలి.'అని రాయుడు ట్వీట్ చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మకు అభినందనలు తెలిపాడు. అతనితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
'టీ20ల్లో టీమిండియా నుంచి తొలి పిలుపు అందుకున్న తిలక్ వర్మకు అభినందనలు. అతని ఎంపికపట్ల చాలా సంతోషంగా ఉన్నా. అతనితో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా.'అని సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశాడు. ఇక మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా తిలక్ వర్మకు అభినందనలు తెలుపుతున్నారు.