తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీలపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పబ్లిసిటీ కోసమే తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు హాజరవుతారని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు తెలుగు రాష్ట్రాలకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవీతో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ, టాలీవుడ్ ఐటమ్ గర్ల్ ఊర్శశీ రౌతేలా, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్లో కనిపించారు.
ఈ సెలెబ్రిటీలు పదే పదే స్క్రీన్పై కనిపించడంతో తెలుగు కామెంటేటర్లు వారి గురించి చిట్ చాట్ చేశారు. సుకుమార్ స్క్రీన్పై కనిపించగానే ప్రముఖ తెలుగు కామెంటేటర్ కళ్యాణ్ కృష్ణ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించాడు. తెలుగు రాష్ట్రాలకు గర్వకారమైన వ్యక్తి స్క్రీన్పై కనిపిస్తున్నారని, తగ్గేదేలా అంటూ మ్యాచ్ చూస్తున్నారని తెలిపాడు. ఆ వెంటనే చాలా మంది తెలుగు సెలబ్రిటీలు ఈ మ్యాచ్కు హాజరయ్యారని గుర్తు చేశాడు.

ఆ కామెంట్స్కు బదులుగా హనుమ విహారీ ఈ బిగ్ మ్యాచ్ను ఎవరూ మిస్సవ్వరూ.. సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ అంటూ కామెంట్ చేశాడు. వెంటనే రాయుడు.. పబ్లిసిటీ కోసం ఈ మ్యాచ్కు హాజరవుతారని, ఇలాంటి మ్యాచ్లకు హాజరైతే ఎక్కువ సేపు టీవీల్లో కనిపించవచ్చని వస్తారని తెలిపాడు. ఫ్రీ పబ్లిసిటీ అని విహారి అనగా.. పవర్ ఆఫ్ క్రికెట్ అంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆయా సెలబ్రిటీలు అభిమానులు రాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం మ్యాచ్కు వెళ్లే కర్మ తమ అభిమాన నటులకు లేదని చివాట్లు పెడుతున్నారు. వెంటనే స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్లు సెలెబ్రిటీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.