రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్ల ఫ్యాన్స్ వార్ హద్దులు దాటుతోంది. సోషల్ మీడియా వేదికగానే ఒకరిపై ఒకరు సవాళ్లు.. విమర్శలు చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు.. భౌతిక దాడులు చేసుకునే స్థాయికి చేరారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దేలేకుండా పోయింది.
చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ నామస్మరణతో దద్దరిల్లింది. ఆర్సీబీ అభిమానుల సంబరాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అదే సమయంలో కొంత మంది అభిమానులు సీఎస్కే ఫ్యాన్స్ను గేలి చేయడం కనిపించింది. గోవిందా గోవిందా అని గట్టిగా అరుస్తూ సీఎస్కే అభిమానులను హేళన చేశారు. అంతేకాకుండా 2017-2018 అని రాసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ జెర్సీలతో ఈ మ్యాచ్కు హాజరయ్యారు.

'ఈ సాలా కప్? లాలిపాప్'
ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల పాటు నిషేధానికి గురైందనే విషయాన్ని గుర్తు చేసేలా కొందరు అభిమానులు ఈ జెర్సీలను ధరించారు. ఈ సీజన్ ఆరంభంలో సీఎస్కే ఫ్యాన్స్ 'ఈ సాలా కప్? లాలిపాప్' అంటూ ఎగతాళి చేయడానికి ప్రతిగా ఆర్సీబీ అభిమానులు 2017-18 జెర్సీలతో బదులిచ్చారు. 2013 ఐపీఎల్ సీజన్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో సీఎస్కే జట్టుకు చెందిన గురునాథ్ మెయ్యప్పన్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆ జట్టుపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అంబటి రాయుడితోనే గొడవ షురూ..
అయితే ఎన్నడూ లేని విధంగా సీఎస్కే జట్టుతో తమకు శతృత్వం పెరగడానికి ప్రధాన కారణం ఆ జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడేనని ఆర్సీబీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఒక్క టైటిల్ గెలవలేదని అవకాశం దొరికినప్పుడల్లా అంబటి రాయుడు ఎగతాళి చేశాడని పేర్కొంటున్నారు. గత సీజన్లో చెన్నైని ఓడించి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది. వరుసగా 7 మ్యాచ్ల్లో గెలిచిన ఆ జట్టు అనూహ్య పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరడంతో ఆర్సీబీ ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ను రాయుడు తప్పుబట్టాడు. అప్పటి నుంచి ఆర్సీబీపై తన అక్కసు వెళ్లగక్కాడు.
సీజన్ ప్రారంభానికి ముందు టైటిల్ గెలవదని చెప్పిన రాయుడు.. ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో మాట మార్చాడు. ఈ సారి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. సీఎస్కేతో మ్యాచ్కు ముందు రాయుడు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే, ఆర్సీబీ మధ్య పెద్దగా పోటీ లేదని, చెన్నై చాలా మ్యాచ్లు గెలిచిందని ఆయన అన్నారు. నిజమైన పోటీ ముంబై ఇండియన్స్తోనే ఉంటుందని టైటిల్స్ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టైటిల్ గెలిస్తే సంతోషిస్తానని, ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఓడించాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
ఉరికిచ్చి కొడుతాం..
ఈ వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్.. రాయుడిని కామెంట్రీ ప్యానెల్లో ఎలా ఉంచుతున్నారని ప్రశ్నించారు. అతని కారణంగానే అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయుడు తన తీరు మార్చుకోకపోతే.. రొడ్డపై ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతామని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే అభిమానుల మధ్య వార్ హద్దులు ధాటుతోందని, ఇది ఏ మాత్రం సరికాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.