Ambati Rayudu: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి నెమ్మదైన పిచ్ కారణమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. పిచ్ను బౌలింగ్, బ్యాటింగ్కు సమంగా సిద్దం చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ యూట్యూబ్ పోడ్కాస్ట్లో మాట్లాడిన రాయుడు.. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ పరాజయంపై స్పందించాడు.
'ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆడిన పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. పిచ్ ఇలా తయారు చేయాలన్నది ఎవరి ఆలోచనో నాకు తెలియదు. కనీసం బ్యాటింగ్, బౌలింగ్కు సమానంగా అనుకూలించే పిచ్ తయారు చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో పోలిస్తే టీమిండియా చాలా బలంగా ఉంది. కానీ తుది పోరులో మాత్రం అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయింది.

ఎలాంటి జట్టునైనా ఓడించే నైపుణ్యం, సత్తా టీమిండియాకు ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో పిచ్ మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉండాలి. అప్పుడు టాస్కు కూడా ప్రాధాన్యం ఉండదు. అయితే ఫైనల్లో పిచ్ను ప్రణాళిక ప్రకారమే ఇలా తయారు చేస్తే అది తెలివి తక్కువతనమే'అని రాయుడు అభిప్రాయపడ్డాడు.
ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపాలైనా.. టైటిల్ అందుకోకపోయినా తాను చూసిన వరల్డ్ కప్ టోర్నీల్లో రోహిత్ సేననే అత్యుత్తమమైనదని అంబటి రాయుడు కితాబిచ్చాడు.
2003 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మన కంటే చాలా బలమైనది. కానీ ఈ సారి మాత్రం టీమిండియానే బలంగా ఉంది. నేను చూసిన ప్రపంచకప్ల్లోని భారత జట్ల కంటే ప్రస్తుత టీమ్ ఉత్తమమైనది. ఆటగాళ్ల నైపుణ్యం, అనుభవం ప్రకారం 2011 ప్రపంచకప్ ఆడిన భారత జట్టు కూడా అత్యుత్తమమైనదే. కానీ ప్రస్తుతం జట్టు ఆడినట్లు గతంలో ఏ భారత జట్టు కూడా ఆడలేదు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన అనంతరం ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ, దేశవాళి క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఈ సీఎస్కే మాజీ క్రికెటర్.. రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్దమవుతున్నాడు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసిన రాయుడు.. ప్రజలను కలుస్తూ.. పొలిటికల్ ఇన్నింగ్స్కు ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.