భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. అతని సతీమణి విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాయుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తన భార్య, బిడ్డతో ఉన్న ఫొటోను రాయుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'మాకు కొడుకు పుట్టాడు.. సంతోషంగా ఉంది.'అని రాయుడు క్యాప్షన్గా పేర్కొన్నాడు.
అంబటి రాయుడు, విద్యకు 2009లో వివాహం జరగ్గా.. 2020 జూలైలో ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడ బిడ్డ జన్మించింది. ఆ పాపకు వివియా అని పేరు పెట్టారు. అనంతరం 2023లో రెండోసారి తండ్రి కాగా.. మరోసారి కూతురే పుట్టింది. తాజాగా 40 ఏళ్ల వయసులో అంబటి రాయుడు మూడో సారి తండ్రి కాగా.. ఈసారి మగ బిడ్డ పుట్టాడు. సోషల్ మీడియా, మీడియాకు చాలా దూరంగా ఉండే రాయుడు.. వ్యక్తిగత గోప్యత పాటిస్తాడు. అతని కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించడానికి ఇష్టపడ్డాడు. మూడోసారి తండ్రైన అంబటి రాయుడుకు సహచర క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు, అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ విజయానంతరం అన్ని రకాల ఫార్మాట్లకు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతను.. వైఎస్సార్సీపీ పార్టీలో చేరి అంతే వేగంగా బయటకు వచ్చాడు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఆ తర్వాత జనసేనలో చేరినా.. క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ కెరీర్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రాయుడు.. మొత్తం 6 సార్లు టైటిల్ అందుకున్నాడు.
రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్గా అవతారమెత్తిన రాయుడు.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వ్యాఖ్యానం చేశాడు. కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ముఖ్యంగా తన సూటి పోటీ మాటలతో ఆర్సీబీ అభిమానులను కవ్వించాడు. విరాట్ కోహ్లీ లక్ష్యంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను తప్పుబడుతూ అతను చేసిన ట్వీట్.. నెట్టింట తీవ్ర దుమారం రేపింది. 'కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది.’అని అతను చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వివాదాల నేపథ్యంలో అంబటి రాయుడిని కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.