హైదరాబాద్: టీమిండియా వెటరన్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. మరికాసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచే తన కెరీర్లో చివరిదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
రిటైర్మెంట్ విషయంలో యూటర్న్ తీసుకునే ముచ్చటే లేదని స్పష్టం చేశాడు. 'ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు గొప్ప జట్ల తరఫున 14 సీజన్లలో 204 మ్యాచ్లు.. 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్ ఆడాను. ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టులో ఆటగాడిగా ఉన్నాను. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. ఇవాళ రాత్రి ఆడే మ్యాచే నా కెరీర్లో చివరిది.
నా క్రికెట్ జర్నీని నేను ఎంతో ఆస్వాదించాను. రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకునే ప్రసక్తే లేదు. అందరీకి ధన్యవాదాలు'అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున 2010లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అంబటి రాయుడు..2018లో చెన్నై సూపర్ కింగ్స్కు మారాడు.

14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో కేవలం రెండు జట్లకు మాత్రమే ఆడిన రాయుడు 204 మ్యాచ్ల్లో 4,329 పరుగులు చేశాడు. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన అతను 2018 సీజన్లో 600 ప్లస్ రన్స్ చేశాడు. తాజా సీజన్లో ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన అతను 15 మ్యాచ్ల్లో 11 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. 132.38 స్ట్రైక్రేట్తో 139 పరుగులు చేశాడు.
సెన్సేషనల్ బ్యాటింగ్తో ముంబై, చెన్నైలకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెరీర్లో ఇదే చివరి సీజన్ అనే హింట్ రాయుడు ఎప్పుడో ఇచ్చాడు. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన పేరును అంబటి రాయుడుకు బదులు ఏటీఆర్గా ప్రమోట్ చేసుకుంటున్నాడు.
సోషల్ మీడియా వేదికగా తన పేరును ఏటీఆర్గా మార్చాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతను వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు.. అదే జిల్లాలోని ఓ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే పనులను రాయుడు బహిరంగంగానే ప్రశంసిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్తో మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్లో చెన్నై గెలిచి ఛాంపియన్గా నిలిస్తే రాయుడికి ఘన వీడ్కోలు దక్కనుంది. టైటిల్ గెలిచిన తర్వాత ధోనీ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన అంబటి రాయుడు.. బోర్డుపై ఉన్న కోపంతో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. కానీ ఆ తర్వాత మళ్లీ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకొని దేశవాళీతో పాటు ఐపీఎల్లో కొనసాగాడు. కానీ ఈ సారి యూటర్న్ తీసుకోనని రాయుడే తన ట్వీట్లో స్పష్టం చేశాడు.