మన అతివల ఆట అంబరాన్ని తాకింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆకాశమంత అంచనాలతో బరిలోకి దిగిన భారత బృందం వాటిని అందుకొని అందనంత ఎత్తులో నిలిచింది. అర్థ దశాబ్ద కాలంగా గుండెలను పిండేస్తున్న ఆవేదనకు విముక్తి లభించింది. గతంలో రెండు సార్లు అందినట్లుగానే అంది చేజారిన కలల కప్ను ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో హర్మన్సేన ముద్దాడింది. 1983 పురుషుల వరల్డ్ కప్ విజయానికి సమానంగా మన అమ్మాయిల రాత మార్చే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఫైనల్ ఒత్తిడిని చిరునవ్వుతో జయిస్తూ తొలిసారి తుదిపోరు చేరిన సౌతాఫ్రికాను టీమిండియా చిత్తుగా ఓడించింది.
అయితే పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో సూర్యకుమార్ యాదవ్ అందుకున్న మ్యాచ్ విన్నింగ్ తరహా దృశ్యమే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లోనూ పునరావృతమైంది. సౌతాఫ్రికా కెప్టెన్, శతక వనిత లారా వోల్వార్డ్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద అమన్జోత్ కౌర్ అద్భుతంగా అందుకుంది. భారత జట్టులోనే టాప్ ఫీల్డర్ అయిన అమన్ జోత్ కౌర్.. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో తడబడింది. కానీ బంతిపైనే దృష్టిని కేంద్రికరించిన అమన్ జోత్ కౌర్.. ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకుంది. ఈ క్యాచ్ అందుకొని భారత జట్టును విజేతగా నిలబెట్టింది.

ఈ క్యాచేనే కనుక అమన్ జోత్ కౌర్ వదిలేసి ఉంటే కప్ కూడా చేజారేది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడినా లారా ఓర్వార్డ్ ఒంటరి పోరాటం చేసింది. డేంజరెస్ బ్యాటర్ అయిన ఆమెకు ఒక్క అవకాశం ఇచ్చినా మ్యాచ్ను లాగేసుకునేది. షెఫాలీ చెలరేగినా.. దీప్తి మలుపు తిప్పినా.. ఈ క్యాచ్ పట్టకుంటే భారత్కు విజయం దక్కేది కాదు. ఈ విజయంలో షెఫాలీ, దీప్తి శర్మ పాత్ర ఉందో.. అంతకు మించిన క్రెడిట్ అమన్ జోత్ కౌర్ది. సంచలన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పడంతో టీమిండియా చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సూర్య క్యాచ్తో పోల్చుతూ పోస్ట్లు పెడుతున్నారు.
ఇదే సౌతాఫ్రికా జట్టుతో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో డేంజరస్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్పై అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్ 11 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించింది. ఈ క్యాచ్ను సూర్య వదిలేసి ఉంటే సిక్సర్గా మారేది. భారత్ ఓటమిపాలయ్యేది. మహిళల ప్రపంచకప్లో అమన్ జోత్ కౌర్ కూడా ఇదే సీన్ను రిపీట్ చేసి భారత్ను విజేతగా నిలబెట్టింది.