మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా ఆల్రౌండర్ అమన్ జోత్ కౌర్ తెలిపింది. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో తడబడినప్పటికీ.. తనకు మరో అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 52 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్, సెంచరీ వనిత లారా వోల్వార్డ్ ఇచ్చిన కీలకమైన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద అమన్ జోత్ కౌర్ అద్భుతంగా అందుకుంది. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో ఆమె తడబడింది. కానీ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టి టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఈ మ్యాచ్ గెలిచిన క్షణం తీవ్ర భావోద్వేగానికి గురైన అమన్జోత్ కౌర్.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. ఓవైపు ఏడుస్తూనే.. మరోవైపు బ్రాడ్కాస్టర్తో మాట్లాడింది.

యావత్ దేశం కోసం ఈ విజయమని చెప్పిన అమన్ జోత్ కౌర్.. గాయంతో ఫైనల్ ఆడలేకపోయిన ప్రతికా రావల్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, ఈ విజయం ఆమెకు కూడా అంకితమని తెలిపింది. 'వోల్వార్డ్ క్యాచ్ ఎంత ముక్యమైనదో అందరికీ తెలుసు. నేను మొదట తడబడ్డాను. కానీ ఆ క్యాచ్ పట్టడానికి నాకు రెండో అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. జనాల అరుపులను చూడవచ్చు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే. మేము ప్రతీ ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తాం. నాకు అండగా నిలిచిన కుటుంబం, నా కోచ్లు, ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. మా నాయనమ్మకు బాగా లేకపోవడంతో వారు ఈ మ్యాచ్కు రాలేకపోయారు. చాలా కీలకమైన సమయంలో మేం ఈ విజయం సాధించాం. ఇది ప్రేక్షకుల విజయం కూడా. మ్యాచ్కు హాజరై ప్రోత్సహించిన ముంబైకి ధన్యావాదాలు. ఈ విజయం మీకోసమే. దేశంలోని ప్రతీ ఒక్కరికి ఈ విజయం అంకితం. ఇది ప్రతిక రావల్ కోసం. గాయం కారణంగా జట్టుకు దూరమైతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంతా సవ్యంగా జరగకపోవచ్చు. కానీ ప్రతీ విషయంలోనూ మంచి ఉంటుంది.'అని అమన్జోత్ కౌర్ పేర్కొంది.