ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బ్యాటర్, కరీంనగర్ బిడ్డ అమన్ రావ్ దుమ్మురేపాడు. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా బెంగాల్తో మంగళవారం రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో అమన్ రావ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 200 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అమన్ రావు.. బెంగాల్ ప్రధాన పేసర్ ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్స్గా తరలించి 200 పరుగుల మార్క్ను అందుకున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో అతనికి ఇది తొలి శతకం కాగా.. దాన్నే డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు. అమన్ రావుకు కెరీర్లో ఇది మూడో లిస్ట్-ఏ మ్యాచ్ మాత్రమే. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన భారత స్టార్ బౌలర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, షెహ్బాజ్ అహ్మద్లను అమన్ రావు చితక్కొట్టాడు. షమీ, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ బౌలింగ్లోనే అమన్ రావు 120 పరుగులు రాబట్టాడు. ఈ ముగ్గురి బౌలింగ్లో 8 సిక్సర్లు బాదాడు.

65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అమన్ రావు.. 108 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. మరో 46 బంతుల వ్యవధిలోనే డబుల్ సెంచరీ సాధించాడు. చివరి ఓవర్లో ఆఖరి బంతికి ముందు 194 పరుగులతో నిలిచిన అమన్ రావు.. ఆకాశ్ దీప్ బౌలింగ్లో సిక్స్ బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ బాదిన 15వ భారత ఆటగాడిగా అమన్ రావు చరిత్రకెక్కాడు. లిస్ట్-ఏ క్రికెట్లో హైదరాబాద్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. అమన్ రావు ద్విశతకంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. అమన్ రావు(154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 200 నాటౌట్)తో పాటు రాహుల్ సింగ్(54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బెంగాల్ బౌలర్లలో మహమ్మద్ షమీ(3/70) మూడు వికెట్లు తీయగా.. షెహ్బాజ్ అహ్మద్, రోహిత్ కుమార్ తలో వికెట్ తీసారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో పుట్టిన అమన్ రావు.. హైదరాబాద్లో పెరిగాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ కుర్రాడు గత కొద్దికాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నారు.
నారాయణ్ జగదీషన్ (తమిళనాడు): 277 పరుగులు - అరుణాచల్ ప్రదేశ్పై (2022)
పృథ్వీ షా (ముంబై): 227* పరుగులు - పుదుచ్చేరిపై (2021)
రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర): 220* పరుగులు - ఉత్తరప్రదేశ్పై (2022)
సంజూ శాంసన్ (కేరళ): 212* పరుగులు - గోవాపై (2019)
స్వస్తిక్ సామల్ (ఒడిశా): 212 పరుగులు - సౌరాష్ట్రపై (2025)
యశస్వి జైస్వాల్ (ముంబై): 203 పరుగులు - జార్ఖండ్పై (2019)
కర్ణ్ కౌశల్ (ఉత్తరాఖండ్): 202 పరుగులు - సిక్కింపై (2018)
సమర్థ్ వ్యాస్ (సౌరాష్ట్ర): 200 పరుగులు - మణిపూర్పై (2022)
అమన్ రావు (హైదరాబాద్): 200* పరుగులు - బెంగాల్పై (2026)