బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లో సమష్టిగా విఫలమవడంతోనే ఓటమిపాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది. బౌలింగ్ మెరుగ్గా చేసినా.. క్యాచ్లు పట్టినా ఫలితం మరోలా ఉండేదని అభిఫ్రాయపడింది. చేజేతులా గెలిచే మ్యాచ్ను చేజార్చుకున్నామని తెలిపింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరిన ఆసీస్.. కీలక పోరులో మాత్రం విజయాన్నందుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన అలీసా హీలీ.. సమష్టి వైఫల్యంతోనే ఈ పరాజయం ఎదురైందని చెప్పింది. ఈ ఓటమికి తాను కూడా ఓ కారణమని ఒప్పుకుంది. కీలక క్యాచ్లు వదిలేయడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పింది.

'ఇదో అద్భుతమైన మ్యాచ్. చేజేతులా విజయాన్ని చేజార్చుకున్నాం. బ్యాటింగ్లో సరిగ్గా ముగించలేకపోయాం. బౌలింగ్ గొప్పగా చేయలేదు. ఫీల్డింగ్లోనూ కీలక క్యాచ్లు వదిలేశాం. దాంతో ఓటమిపాలయ్యాం. 339 పరుగుల భారీ లక్ష్యం సరిపోతుందనుకున్నా. సగం మ్యాచ్ పూర్తయిందని భావించా. కానీ చివర్లో మేం ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. కానీ బంతితో మెరుగ్గా రాణిస్తే విజయం దక్కుతుందని భావించాం. కానీ భారత్ అద్భుతంగా ఆడింది. నిగ్రహం కోల్పోకుండా ఆడి విజయం సాధించింది.
కెప్టెన్గా తర్వాతి తరం ఆటగాళ్ల ప్రతిభ చూడటం నాకు విచిత్రమైన అనుభవం. లిచ్ఫీల్డ్ అద్భుతంగా ఆడింది. మాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. సెంచరీతో చెలరేగింది. ఆమెకు నా అభినందనలు. ఆమె చాలా సరదాగా ఉంటుంది. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు ఆమె ఆటను చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను. ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కనున్నాయి. తదుపరి సైకిల్లో జట్టులో మార్పులు జరగవచ్చు.
ఈ టోర్నీలో యాష్ గార్డ్నర్ సంచలన ప్రదర్శన కనబర్చింది. జట్టులో ప్రతీ ఒక్కరు అద్భుతంగా రాణించారు. అందుకే ఈ మ్యాచ్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్లో భారత్ను ఒత్తిడికి గురి చేయడంతో పాటు విజయవకాశాలను సృష్టించాం. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. దానికి నేను కూడా ఓ కారణమే. ఫీల్డింగ్ను గర్వంగా భావించే మేం ఆ విషయంలోనే నిరాశపర్చాం.
ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. మరింత బలంగా తిరిగి వస్తాం. సెమీ ఫైనల్ అనేది నాకౌట్ గేమ్. ఇందులో రాణించకపోతే ఏ జట్టు అయినా ఓడిస్తుంది. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించినా గర్వపడే ప్రదర్శన చేశాం. ప్రతీ మ్యాచ్లో ఎవరో ఒక్కరు బాధ్యత తీసుకొని చెలరేగారు. ఇంత బాగా ఆడి టోర్నీ నుంచి తప్పుకోవడం బాధగా ఉంది. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడను. కొత్త ఆటగాళ్లతో జట్టు నిండిపోతుంది.'అని అలీసా హీలీ చెప్పుకొచ్చింది. మ్యాచ్ విన్నర్, సెంచరీ హీరోయిన్ జెమీమా రోడ్రిగ్స్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్లను అలీసా హీలీ నేలపాలు చేసింది.