టీమిండియా కెప్టెన్గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే సరైన ఆప్షన్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అన్నాడు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలు అతనికే ఇవ్వాలని సూచించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించిన విషయం తెలిసిందే.
వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం కాగా.. బుమ్రా తాత్కలిక కెప్టెన్గా వ్యవహరించాడు. అసాధారణ కెప్టెన్సీతో పాటు అద్భుత బౌలింగ్తో ఈ మ్యాచ్లో భారత్కు చారిత్రాత్మక విజయాన్నందించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్కు రోహిత్ శర్మ అందుబాటులో రావడంతో అతనే జట్టును నడిపించగా.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్కు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ డ్రాతో గట్టెక్కింది. రోహిత్ శర్మ అటు బ్యాటర్గానూ.. ఇటు కెప్టెన్గానూ విఫలమవుతున్నాడు. చివరి రెండు టెస్ట్ల్లోనూ రోహిత్ విఫలమైతే.. కెప్టెన్సీకి గుడ్ బై చెబుతాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు బుమ్రా అద్భుతమైన కెప్టెన్సీ ఆప్షన్ అవుతాడని అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డాడు.
'జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. పెర్త్ టెస్ట్లో బుమ్రా అసాధారణ బౌలింగ్తో పాటు సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తనను తాను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఫీల్డ్ సెటప్ కూడా అద్భుంగా సెట్ చేశాడు. అతని బౌలింగ్ శైలి ఇతర బౌలర్ల కంటే భిన్నంగా ఉంటుంది.
ముఖ్యంగా మణికట్టు, బంతిని వదిలే స్థానం కాస్త ఆలస్యంగా ఉంటుంది. అతని రన్నప్ కూడా భిన్నంగా ఉంటుంది. దాంతో బుమ్రా బౌలింగ్లో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు.'అని అలెన్ బోర్డర్ వివరించాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.