టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడుతాడు. ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో తనకు నచ్చిన పనులు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ ఫామ్ హౌస్లో పెంపుడు జంతువులను పెంచడంతో పాటు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు.
తనకు ఇష్టమైన బైక్లపై అప్పుడప్పడు రాంచీ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాడు. ధోనీ టీమిండియాకు దూరమై ఐదేళ్లు గడుస్తున్నా.. అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టీమిండియా కెప్టెన్గా ఉన్నప్పుడే సాక్షి సింగ్ను ధోనీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి జీవా అనే పాప పుట్టింది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో ధోనీ సంతోషంగా ఉంటున్నాడు. సతీమణి సాయంతో వ్యాపారాలను కూడా ధోనీ బాగానే విస్తరించాడు. ధోనీ సాయంతో సాక్షి సింగ్ సినిమా ప్రొడ్యూసర్గా కూడా అవతారమెత్తింది.

అయితే సాక్షి సింగ్ కంటే ముందు ధోనీ ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆమె పేరు ప్రియాంక ఝా. కానీ ఆ అమ్మాయి ధోనీ సక్సెస్ చూడకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించింది. ప్రియాంక ఝాను ధోనీ గాఢంగా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ విధి వారిని విడదీసింది. 2002-03లో ధోనీ భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. జింబాబ్వే, కెన్యాలో పర్యటించాడు. ధోనీ ఈ పర్యటనలో ఉండగానే ప్రియాంక ఝా మరణించింది. ఈ విషయం ధోనీకి తెలియదు. అప్పట్లో మొబైల్స్ కూడా లేవు. ఆ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ధోనీ ఈ విషయం తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కానీ భారత జట్టుకు ఆడాలనే ఆమె కలను గుర్తు తెచ్చుకొని మరింత కష్టపడ్డాడు.
ప్రియాంక ఝా ఎవరు? ఆమె స్వస్థలం ఎక్కడా? ఆమెకు ధోనీతో ఎలా పరిచయమైంది? అనే విషయాలపై స్పష్టమైన సమాచారం లేదు. ఆమె మరణించడంతో ధోనీ కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ ధోనీ క్రికెట్ కెరీర్ కథాంశంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ అన్టోల్డ్ స్టోరీ సినిమాలో ఈ లవ్ స్టోరీని చూపించడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. ధోనీ పాత్రలో దివంగత సుశాంత్ రాజ్పుత్ నటించగా.. ప్రియాంక ఝా పాత్రను దిశా పటాని పోషించింది.
కాకపోతే సినిమాలో ధోనీ.. పాకిస్థాన్తో వైజాగ్ మ్యాచ్కు వచ్చే సమయంలో ఫ్లైట్లో పరిచయమైనట్లు చూపించారు. కానీ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయకముందే ఆమె మరణించింది. 2004లో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో తొలి అవకాశాన్ని అందుకున్న ధోనీ.. ఫస్ట్ మ్యాచ్లోనే డకౌటయ్యాడు. కానీ వైజాగ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ దిగి విధ్వంసకర బ్యాటింగ్తో కొత్త చరిత్రను లిఖించాడు.
ప్రియాంక ఝా.. టాలీవుడ్ యాక్టర్ లక్ష్మీరాయ్ అని, ఆమెతోనే ధోనీ లవ్ ఎఫైర్ నడిపించాడని, ఇద్దరికీ బ్రేకప్ కావడంతో చనిపోయినట్లు చూపించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రియాంక ఝాను సినిమా కథ కోసం సృష్టించిన పాత్రనా? లేక ధోనీ గాఢంగా ప్రేమించిన అమ్మాయా? అనేది అతనికి తప్పా మరెవరికీ తెలియదు. ఈ విషయంపై ధోనీని అడిగే ప్రయత్నం మీడియా చేసినా అతను స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.