టీమిండియా ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అండగా నిలిచాడు. డ్రాకు అంగీకరించాలని బెన్ స్టోక్స్ ప్రతిపాదనను భారత ఆటగాళ్లు తిరస్కరించడం సరైన చర్యగా పేర్కొన్నాడు. ఈ వ్యవహరంలో ముమ్మాటికి బెన్ స్టోక్స్దే తప్పు అని అభిప్రాయపడ్డాడు. స్టోక్స్ అలా ప్రవర్తించాల్సింది కాదన్నాడు.
ఇంగ్లండ్తో ఆదివారం ముగిసిన నాలుగో టెస్ట్ చివర్లో హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అద్వితీయమైన బ్యాటింగ్తో రాణించిన జడేజా, సుందర్ల సెంచరీలను అడ్డుకోవాలనే దురుద్దేశంతో బెన్ స్టోక్స్ నిర్ణీత సమయం కన్నా ముందే డ్రాకు ప్రతిపాదించాడు. అయితే ఈ విజ్ఞప్తికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో సహనం కోల్పోయిన బెన్ స్టోక్స్.. భారత ఆటగాళ్లను అవమానపర్చేలా మాట్లాడాడు. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్లో సెంచరీలు చేస్తారా? అని హేళన చేశాడు.

ఈ మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఇంత హేళన చేసినా.. సహనంగానే స్పందించిన జడేజా.. డ్రా అనేది తమ చేతుల్లో లేదని చెప్పాడు. ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్న అనంతరం భారత్కు డ్రాకు అంగీకరించడంతో మ్యాచ్ ముగిసింది. అయితే జడేజాపై కోపంతో బెన్ స్టోక్స్ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అసహనం వ్యక్తం చేస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమని బెన్ స్టోక్స్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా స్టోక్స్ను తప్పుబట్టాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లే జడేజా, సుందర్ ప్లేస్లో ఉంటే డ్రాకు అంగీకరించేవాడా? అని ప్రశ్నించాడు.
ఈ వ్యవహారంపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన అలిస్టర్ కుక్.. బెన్ స్టోక్స్ను తప్పుబట్టాడు. 'టీమిండియా ఆటగాళ్లదే సరైన నిర్ణయం. తమకు లంభించిన మూమెంటమ్ను కొనసాగించాలనుకున్నారు. 140 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేస్తే ఎవరైనా విసుగు చెందుతారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా సహనం కోల్పోయారు.
డ్రాకు భారత్ అంగీకరించకపోవడానికి బలమైన కారణం కూడా ఉంది. రెండు అద్భుతమైన శతకాలు ఈ మ్యాచ్ను కాపాడాయి. శుభ్మన్ గిల్ కూడా సెంచరీ చేశాడు. కాబట్టిన హ్యారీ బ్రూక్ 37 mph బంతిని అంతా మర్చిపోతారు.