టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై యువ బౌలర్ ఆకాశ్ దీప్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని కొనియాడిన ఆకాశ్ దీప్.. అతన్ని దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడని తెలిపాడు. బుమ్రా నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాశ్ దీప్ బుమ్రాకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'జస్ప్రీత్ బుమ్రాతో నేను తరుచూ మాట్లాడుతూ ఉంటాను. అతని బౌలింగ్ను గమనిస్తాను. బుమ్రా అసాధారణమైన బౌలర్. దేవుడు అందరిలా కాకుండా అతన్ని ప్రత్యేకంగా తయారు చేశాడు. లేకపోతే ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. బుమ్రా నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఎవరైనా బ్యాటర్కు బౌలింగ్ చేస్తున్నప్పుడు మానసిక స్థితి ఎలా ఉండాలని బుమ్రాను అడిగాను.
ఏ బ్యాటర్కు ఎలాంటి బంతి వేయాలనే దానిపై చాలా విషయాలు నాకు చెప్పాడు. క్రికెట్పై బుమ్రాకు మంచి అవగాహన ఉంది. ఎన్నో టెక్నిక్లను ఉపయోగిస్తూ బౌలింగ్ చేస్తాడు. బంతి వేసే ముందే బ్యాటర్ కదలికలను పసిగడుతాడు. అతన్ని అనుసరించడం అంత సులువైన పనికాదు.'అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.
బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో బుమ్రా ఐదు వికెట్లు తీసాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. దాంతో ఈ మ్యాచ్లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఐదు వికెట్లతో బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి బుమ్రా 47 వికెట్లు తీసాడు. మొత్తం 14 మ్యాచ్లు 20 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించాడు.
బంగ్లాదేశ్తో కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం జరిగినా.. బీసీసీఐ అతన్ని రెండో టెస్ట్కు ఎంపిక చేసింది.